పేకాట క్లబ్బులు - సూట్కేసు కంపెనీలు : ఒక కులం మీద కక్ష కట్టి-ఆ పేర్లేనా : పవన్ కీలక వ్యాఖ్యలు..!!
రెండు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానం.. ఓటు అమ్మకునే విధానం మారాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ విరామం తరువాత ఆయన రాజకీయంగా మరో సారి ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ నాయకులంటే పేకాట క్లబ్ లునడిపే వారు కాదని వ్యాఖ్యానించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగొట్టే వారు నాయకులు కాదని పేర్కొన్నారు. కొత్త తరం నాయకులు, కొత్త రాజకీయం రావాలన్నారు. తాను వృద్దుడిగా అయ్యే లోపు రాజకీయ మార్పు వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.

కులం మీద కక్ష్య కడితే...
తప్పు చేస్తే... శిక్ష తప్పదు అనే భయం ఉండాలి..ప్రజలు కూడా తమ ఆలోచనల తీరు మార్చుకోవాలని సూచించారు. ఓటువేసే ముందు సామాజిక ప్రయోజనాలా... వ్యక్తిగత ప్రయోజనం కావాలా అనేది ఆలోచించాలని కోరారు. ప్రజల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని పవన్ పేర్కొన్నారు. నేడు ఒక కులం మీద పాలకులు కక్ష కట్టి వేధిస్తే... రేపు వాళ్లు అధికారంలోకి వస్తే మరో కులం పై కక్ష కట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కులాల మధ్య అసమానతలు పోయి .. భారతీయులుగా ఉండాలని పిలుపునిచ్చారు.

దోచుకోవటమే లక్ష్యంగా..
ప్రపంచ దేశాల అభివృద్ధి లో భారతీయుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. కానీ మనదేశానికి వారు సేవలు అందించ లేకపోతున్నారన్నారు. ఇందుకు మన రాజకీయ నాయకులే ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. మువ్వెన్నల జెండా రూపకర్త పింగళి వెంకయ్య దుర్భరమైన జీవితం అనుభవించారని చెప్పారు. జనసేన ఆవిర్భావానికి ప్రేరణ ఇటువంటి సంఘటనలేనని పవన్ వివరించారు. 25ఏళ్ల భవిష్యత్తు ప్రస్థానంతో ముందుకు వెళుతున్నాని స్పష్టం చేసారు. నాడు ఆస్తులు వదులుకుంటే... నేటి రాజకీయ నాయకులు ఆస్తులు దోచుకుని వాడేసుకుంటు న్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

సీఎం కుటుంబ సభ్యుల పేర్లా..
నాటి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి నేటి తరంలో రావాలని కోరారు. ప్రభుత్వ పధకాలకు సిఎం, వారి కుటుంబ సభ్యులు పేర్లు పెట్టుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశం, రాష్ట్రం కోసం పోరాడే మహనీయులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, పింగళి వంటి వారి పేర్లు ఎందుకు పెట్టరని పవన్ ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని పధకాలకు జాతీయ నాయకుల పేర్లే పెడతామని ప్రకటించారు. పార్టీ నాయకులతోనూ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
జగన్ ప్రభుత్వం రోజురోజుకీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని పార్టీ నేతల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పైన ఎక్కడికక్కడ పోరాటాలకు సిద్దం కావాలంటూ నేతలకు పిలుపునిచ్చారు. తాజాగా బీజేపీ నేతలతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాలను పవన్ పార్టీ నేతలతో పంచుకున్నారు.












Click it and Unblock the Notifications