కంఠంలో ప్రాణం ఉండగా అలా కానివ్వను, 100 కోట్ల ఆదాయం వదిలేశా: బాబు-జగన్లపై పవన్
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. కాకినాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతి, లంచాలు లేని పాలనను తాను చంద్రబాబు నుంచి కోరుకున్నానని, కానీ ఇప్పుడు అడుగడుగునా అవినీతే అన్నారు.
వైయస్ తప్పే బాబు చేస్తున్నారు, తెలంగాణలో పోటీపై డైలమాలో.. క్లారిటీ ఇస్తా: పవన్ కళ్యాణ్
ప్రాంతీయవాదం పుట్టుకు రావడం ఖాయం
ప్రజలకు, యువతకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు అన్నీ అమరావతిలోనే పెడితే ఎలా అన్నారు. ఉద్దానంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. దీనిపై మన ఎంపీలు మాట్లాడారని విమర్శించారు. పార్లమెంటులో తెలుగు ఎంపీలను కొడుతుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మనవారు చోద్యం చూస్తూ కూర్చున్నారన్నారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ వాదం పుట్టుకు రావడం ఖాయమని హెచ్చరించారు. టీడీపీ చేసే అడ్డగోలు, అవినీతిని జనసేన ప్రశ్నిస్తుందన్నారు.
నా కంఠంలో ప్రాణం ఉండగా ఏపీని చిన్నాభిన్నం కానివ్వను
చంద్రబాబు భావితరాలను ప్రభావితం చేసే వ్యక్తి అనుకున్నానని, కానీ చిన్నాభిన్నం చేసే వ్యక్తి అన్నారు. కుల రాజకీయాలు చేస్తే అందరం చిన్నాభిన్నం అవుతామన్నారు. తన కంఠంలో ప్రాణం ఉండగా ఏపీని చిన్నాభిన్నం చేయడాన్ని చూస్తూ ఊరుకోనని చెప్పారు. తాను గంగమ్మతల్లికి పూజలు చేసిన వాడిని అన్నారు. గోదావరి జిల్లాలు తన మూలాలు ఉన్న ప్రాంతమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను గళమెత్తింది కాకినాడ నుంచే అన్నారు.
ఎన్టీఆర్ ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెట్టారు
రూ.3500 కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని పవన్ ప్రశ్నించారు. దేశ సంపద ఎక్కడకు వెళ్లిపోతోందని ప్రశ్నించారు. సంపద ఎక్కడికో తరలిపోతుంటే బాధ వేస్తోందన్నారు. ఎన్టీఆర్ అప్పుడు ఓ ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెట్టారని గుర్తు చేశారు. జనసేన ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ అన్నారు. సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను స్థాపించాలన్నారు.
అప్పుడే సీఎంను అవుతా, జగన్ అలా అంటున్నారు
అభిమానులు పదేపదే సీఎం.. సీఎం అని నినాదాలు చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ప్రజల దీవెనలే తనను ముఖ్యమంత్రిని చేస్తాయని చెప్పారు. ప్రజల తరఫున పోరాటం చేసే నాయకులు ఇంకా ఉన్నారని చెప్పేందుకే తాను వచ్చానని చెప్పారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే అన్ని సమస్యలు తీరుస్తానని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎగిరే పక్షి కూడా గూడు కావాలని కోరుకుంటోందన్నారు. ఇప్పటికీ కానీ ఇల్లు లేని వారిని చూస్తే బాధ వేస్తోందన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అందులో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.
సంవత్సరానికి రూ.100 కోట్ల ఆదాయం వదిలేశా
సంవత్సరానికి రూ.100 కోట్ల ఆదాయాన్ని వదులుకొని తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్యాయాన్ని ఎదిరించేందుకే జనసేన పుట్టిందని చెప్పారు. జనసేన పార్టీ ఏ సమస్యను లేవనెత్తితే ముఖ్యమంత్రి చంద్రబాబు దాని గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. నేను ఉద్ధానంకు వెళ్తే దాని గురించి, వంతాడ గురించి మాట్లాడితే దానిపై మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. తాను క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని పెట్టానని చెప్పారు. ముస్లీంలు అంటే తనకు ఓటు బ్యాంకు కాదన్నారు.