జగన్ పై పవన్ మరో యుద్దానికి సిద్దంగా..: మూడు రాజధానులపై కీలక భేటీ: నిర్ణయంపై ఉత్కంఠ..!
ఏపీలో రగులుతున్న మూడు రాజధానుల వ్యవహారం పైన జనసేనాని నిర్ణయం ఏంటి. జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తారా..అమరావతి జనం వైపు నిలుస్తారా. ప్రతిపక్షాలు అన్నీ ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతి ేకిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో ఏర్పడిన జేఏసీల్లో ఇప్పటికే జనసేన భాగస్వామిగా ఉంది. అయితే, పార్టీ అధినేతగా పవన్ అధికారికంగా తీసుకొనే నిర్ణయం మీద ఉత్కంఠ ఏర్పడింది. మూడు రాజధానుల వ్యవహారం పైన ఈ నెల 27న జరిగే కేబినెట్ నిర్ణయాన్ని పరిశీలించి..నేడు జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని పవన్ భావించారు.
అయితే, నిర్ణయం వాయిదా పడటంతో పాటుగా దీని పైన మరో కమటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో..ఈ రోజు జరిగే సమావేశంలో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది. అమరావతి ప్రజలతో పాటుగా ప్రభుత్వం అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు పవన్ ప్రకటన వైపు ఉత్కంఠగా చూస్తున్నాయి.

మూడు రాజధానులపై చర్చ..
జనసేన పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఈ రోజు మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరగనుంది. ఏపీలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ప్రధానంగా మూడు రాజధానుల ప్రతిపాదనల పైన పార్టీ చర్చించనుంది. అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళలన..పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ పైనా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పార్టీ ముఖ్య నేతలు నాగబాబు..నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అక్కడి రైతులకు మద్దతు ప్రకటించారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితుల పైన ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కు వారు నివేదించారు. ఇప్పటికే రాజధాని ప్రాంత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో ఏర్పడిన జేఏసీల్లో జనసేన భాగస్వామిగా ఉంది. అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు రాజధానిని అమరావతి నుండి తరలించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

అందరితో చర్చించి..పవన్ నిర్ణయం
ఈ సమావేశానికి పార్టీకి చెందిన నేతలు హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. పార్టీ పాలిట్ బ్యూరోతో పాటుగా రాజకీయ వ్యవహారాల కమటీ సభ్యులు.. వ్యూహాత్మక కమిటీ.. ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శులు.. అధికార ప్రతినిధులు.. రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. వీరందిరితోనూ చర్చించిన తరువాత పవన్ రాజధాని తరలింపు పైన తన విధానం స్పష్టం చేయనున్నారు.
గతంలో రాజధాని ప్రాంతంలో రైతుల నుండి బలవంతంగా భూములు సేకరిస్తే వారికి అండగా ఉంటానని పవన్ అప్పట్లోనే రాజధాని గ్రామాల్లో పర్యటించి హామీ ఇచ్చారు. అదే రైతులు ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర.. రాయలసీమ ప్రాంత వాసుల అభిప్రాయలను పరిగణలోకి తీసుకొని పవన్ నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

జేడీ ఇప్పటికే చెప్పేసారు..మరి ఎమ్మెల్యే
తాము అన్ని ప్రాంతాలను డెవలప్ చేయటానికి వ్యతిరేకం కాదని..అయితే పాలనా వికేంద్రీకరణ మాత్రం సరైన విధానం కాదని ఇప్పటికే జనసేన నేత..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేసారు. అదే సమయంలో కొద్ది రోజులుగా అధికార పార్టీకి..ముఖ్యమంత్రి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే చర్చ సాగుతోంది.
అసెంబ్లీలో ఇదే అంశం పైన చర్చ జరిగితే ఆయన పార్టీ వాయిస్ వినిపించాల్సి ఉంటుంది. దీంతో..ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన జనసేనాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో సాయంత్రానికి డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పవన్ నిర్ణయం కోసం ప్రతిపక్ష పార్టీలతో పాటుగా సాధారణ ప్రజలు సైతం ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications