ఏపీలో బీజేపీ భారీ ప్లాన్- జగన్ ప్రత్యర్ధిగా పవన్ ! ఉమ్మడి శత్రువు చంద్రబాబుకు చెక్?
ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ లేదా జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు మాత్రమే కొనసాగుతున్నట్లు పైకి కనిపిస్తోంది. కానీ లోలోపల మాత్రం భారీ రాజకీయ చదరంగ క్రీడకు రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ టూర్ తర్వాత పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అప్పటివరకూ ఓ సాదాసీదా విపక్ష పార్టీ నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్తా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నారు. అదే సమయంలో బీజేపీ, జగన్ ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా ఉన్న చంద్రబాబు ప్రభ మసకబారేలా కనిపిస్తోంది.
పవన్ కేంద్రంగా ఏపీ రాజకీయం
ఏపీలో విశాఖలో వైసీపీ గర్జన సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. పైకి చూసేందుకు మూడు రాజధానుల పోరుగా కనిపించినా ఆ తర్వాత దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విపక్షాలుచేసిన ప్రయత్నాలతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. దాని ప్రభావం ప్రధాని మోడీ విశాఖ టూర్ పైనా పడింది.
విశాఖలో వైసీపీ గర్జన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లడం, ఆయన్ను అడ్డుకునేందుకు పోలీసులతో వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నంతో పరిస్ధితులు ఒక్కసారిగా మారాయి. విశాఖ నుంచి విజయవాడకు పవన్ రావడం, చంద్రబాబుతో భేటీ కావడం, ఆ తర్వాత ప్రధాని మోడీ విశాఖ టూర్ లోనూ ముందుగా పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో పవన్ ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది.
పవన్ కు బీజేపీ ఎలివేషన్?
విశాఖలో వైసీపీ గర్జన తర్వాత మారిన పరిస్ధితుల్లో పవన్ కు పెరిగిన ప్రాధాన్యం వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ కు ముందు బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించేశారు. దీంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది.
పవన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఆయన ప్రాధాన్యం పెంచడం ద్వారా ఏపీ రాజకీయాల్లో ఆయన్ను కీలకంగా మార్చాలని నిర్ణయించింది. అప్పుడే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టిసారించకుండా ఉంటారనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకు తగినట్లుగానే పవన్ కు తగిన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
పవన్ కు బిగ్ ప్లాన్ చెప్పిన మోడీ?
విశాఖ టూర్ కు వచ్చీ రాగానే పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ప్రధాని మోడీ.. ఆయనతో దాదాపు అరగంటసేపు మాట్లాడారు. ఇందులో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. అందులోనే పవన్ కళ్యాణ్ కు మంచి రోజులు రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు.
రాష్ట్రంలో రాజకీయాన్ని మలుపు తిప్పేందుకు తాము ప్లాన్ అమలు ప్రారంభించామని, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని మోడీ చెప్పినట్లు తెలిసింది. అప్పటివరకూ టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నించకుండా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండమని సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా సరేనన్నారు.
చంద్రబాబు స్దానంలో పవన్ కళ్యాణ్?
బీజేపీ బిగ్ ప్లాన్ ప్రకారం ఏపీలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్ధానంలో పవన్ ను కూర్చోబెట్టేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ఏపీలో 2019 ఎన్నికల్లో కుదేలైన చంద్రబాబు తిరిగి పునర్ వైభవం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు. అదే సమయంలో వైసీపీ అంతకంతకూ బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
దీంతో చంద్రబాబును తిరిగి లేవనీయకుండా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ను ఆ స్ధానంలో కూర్చోబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి వైసీపీ సాయం కూడా తీసుకుంటోంది.
జగన్ సాయంతో పవన్ ఎలివేషన్?
పైకి చూడటానికి వింతగా కనిపించినా తెరవెనుక జరుగుతున్న రాజకీయం నిశితంగా గమనిస్తే చంద్రబాబు కంటే తనకు ప్రత్యర్దిగా పవన్ కళ్యాణ్ ఉంటే మేలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే చంద్రబాబుతో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న మీడియా సంస్ధల్ని సైతం జగన్ పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబును కోలుకోనీయకుండా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ను తన ప్రత్యర్ధిగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. తిరిగి ఇదంతా బీజేపీ కన్నుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల నాటికి జగన్ ప్రత్యర్ధిగా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ను ఉంచగలిగితే అప్పుడు భవిష్యత్ రాజకీయంపై తమకు పట్టు చిక్కుతుందని కాషాయ నేతలు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏపీలో తాము ఉనికి చాటుకోవచ్చనేది బీజేపీ బిగ్ ప్లాన్.