మరో ఇద్దరు పవన్లు ఉండాల్సింది! అప్పుడు చెబుతా: జనసేనాని, 'చింతమనేనీ! నోరు జాగ్రత్త'
ఏలూరు: పోలవరం పర్యటనకు వచ్చిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు శనివారం రాత్రి పట్టిసీమ వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రివర్ ఇన్ రిసార్టులో ఆయన బస చేశారు. ఆదివారం పలువురు నేతలు జనసేన పార్టీలో చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలవరం నిర్వాసితులతో పవన్ మాట్లాడుతారు.
ఐటీ దాడి ఎఫెక్ట్: ఐటీ ఆఫీసర్లకు నో సెక్యూరిటీ, సుప్రీం కోర్టుకు.. బాబు సంచలన నిర్ణయాలు!
పవన్ కళ్యాణ్ రాక గురించి తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు, అభిమానులు, మహిళలు రోడ్ల పైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రిసార్ట్ వద్ద అభిమానులు డబ్బులతో సందడి చేశారు. జై పవన్, జై జనసేన అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పవన్ రిసార్టు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు.
ఒకరిద్దరు పవన్ కళ్యాణ్లు ఉంటే బాగుండు అనిపించినా
కొన్ని సందర్భాల్లో ఒక్కరిద్దరు పవన్ కళ్యాణ్లు ఉంటే బాగుండుననిపిస్తోందని, కాని అలా జరగదని, మీరే నా పవన్ కళ్యాణ్లు, మన సమర్ధత మన చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉందని జనసేనాని అంతకుముందు ఉభయగోదావరి జిల్లా నేతలతో శనివారం అన్నారు.
చంద్రబాబు, జగన్ పార్టీలపై పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వచ్చి నడపడం, వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అంతా వైసిపిలోకి రావటం సంస్థాగతంగా వారికి చాలా తేలిక అని, మనం అలా కాదని, మనకు ఒక కొత్తతరం, కొంతమంది అనుభవజ్ఞులు, ఎక్కువశాతం సమాజం కోసం పనిచేద్దానుకునే వ్యక్తులు ఉన్నారని, రాటు తేలటానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. నేను పాలసీల గురించి మాట్లాడుతాను తప్పితే ఇద్దరు వ్యక్తుల గొడవ గురించి మాట్లాడనని చెప్పారు.
బైక్స్ సౌండ్ పైన పవన్ కళ్యాణ్
పెద్దలందరికి చెబుతున్నానని, యువతను బైక్స్ సౌండ్ తగ్గించమనండని, కాకపోతే ప్రభుత్వాలు వారికి ఉపాధి కల్పించకుండా, సరైన విద్యావకాశాలు కల్పించకపోవడంతో వారి ఆవేశాన్ని ఇలా చూపిస్తున్నారని, అర్థం చేసుకోగలనని పవన్ చెప్పారు. బైక్స్ సౌండ్ వల్ల కొంతమందికి ఇబ్బంది ఉంటుందని, వేగం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, మనం వెళ్లే విధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలని, అందరికి నచ్చేలా ఉండాలన్నారు. యుద్ధం చేసేప్పుడే శంఖం పూరించాలని, యుద్ధం ఎప్పుడు చేయాలో నేను చెబుతానని, అప్పుడు మనం బలంగా శంఖం పూరిద్దామని, అప్పటి వరకు సంయమనం పాటించాలన్నారు.
చింతమనేని! నోరు జాగ్రత్త
పవన్ కళ్యాణ్ పైన దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన జిల్లా సమన్వయకర్త డేవిడ్ రాజు శనివారం నిప్పులు చెరిగారు. చింతమనేని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, జనసైనికులు కదం తొక్కితే ఆయనకు పరాభవం తప్పదని హెచ్చరించారు. మచ్చలేని నాయకుడు పవన్ అన్నారు. చింతమనేని నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. గత నాలుగేళ్లగా బీజేపీతో కలసి ఉన్న టీడీపీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన కలసి బీజేపీ కొమ్ము కాస్తున్నాయంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.