ఐటీ దాడులపై మేమెందుకు స్పందించాలి?, మోడీ మాకేమైనా చుట్టమా?: పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు. టీడీపీ నాయకులపై ఐటీ దాడులు జరిగితే తామెందుకు స్పందించాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

వారిపై ఐటీ దాడులు జరిగితే తామెందుకు స్పందించాలి?
ఏపీ సీఎం కార్యాలయం, సచివాలయంలో ఐటీ దాడులు జరిగితే తాము స్పందించేవారమని అన్నారు. ఎక్కడో, ఎవరిపైనో ఐటీ దాడులు జరిగితే తమను స్పందించాలని కోరడమేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

కవాతు అందుకే
ప్రభుత్వంలో జవాబుదారీతనం కోసమే ధవళేశ్వరం కవాతు నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఏపీకి మరిన్ని సమస్యలను తెచ్చి పెట్టిందన్నారు. రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోరే వారిని తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు.

విభజన తర్వాత భయమేసింది
రాష్ట్ర విభజన తర్వాత ఏం జరుగుతుందోనని భయమేసిందని అన్నారు. ఎవరో చేసిన తప్పునకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. బీజేపీ, టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండానే ఎన్నికల్లో వారికి మద్దతు తెలిపినట్లు చెప్పారు.

హోదాపై ఎప్పుడూ చర్చించలేదు
ప్రత్యేక హోదా గురించి తమతో సీఎం చంద్రబాబు ఎప్పుడూ చర్చించలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అఖిలపక్షంతో హోదాపై సీఎం చంద్రబాబు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. హోదా కోసం తొలి నుంచి పోరాటం చేస్తున్నది జనసేననే అని తెలిపారు. ప్రతి సభలోనూ హోదా డిమాండ్ చేశామని అన్నారు.

మోడీ ఏమైనా చుట్టమా?
చంద్రబాబు అనుభవం, తోడ్పాటు రాష్ట్రానికి తోడ్పాటునందిస్తునుకుంటే.. ఇప్పుడు మాటమార్చి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీని వెనకేసుకురావాల్సిన అవసరం తనకు లేదని, ఆయన నాకేమైనా బంధువా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తన కుటుంభ్యులనే కాదని వచ్చానని చెప్పారు.












Click it and Unblock the Notifications