14 నుంచి పవన్ కళ్యాణ్ గోదావరి బాట ! బీజేపీ ఎంట్రీతో సీట్ల లెక్క మారుతోందా ?
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం విపక్ష టీడీపీ-జనసేన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకోగా.. వీరితో కలిసి వచ్చేందుకు బీజేపీ కూడా రెడీ అయింది. ఈ నేపథ్యంలో సీట్ల లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటికే తమకు బలమున్న స్ధానాల్లో సీట్లు కోరుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుటు బీజేపీ రాకతో సమీకరణాలు మార్చుకోవాల్సి వస్తోంది.
గతంలో పలుమార్లు గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన పవన్ కళ్యాణ్ మరోసారి అదే జిల్లాల్లో టూర్ కు సిద్ధమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున అన్ని సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉన్న పవన్.. అందుకు తగ్గట్టుగానే సీట్ల చర్చలు జరుపుతున్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో తెలియని పరిస్ధితుల్లో ఇప్పటివరకూ చంద్రబాబుతో గోదావరి జిల్లాల్లో సీట్లపై చర్చలు జరిపిన పవన్ ఇప్పుడు కాషాయ పార్టీ ఎంట్రీతో లెక్కలు మార్చుకోవాల్సిన పరిస్ధితి.

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో బీజేపీకి కూడా తప్పనిసరిగా సీట్లు కేటాయించిన పరిస్ధితి ఉంది. దీంతో క్షేత్రస్ధాయిలతో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి వాస్తవ పరిస్దితి తెలుసుకునేందుకు ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించేలా పవన్ టూర్ ఖరారైంది.తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొనే పవన్.. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు.
క్షేత్రస్ధాయిలో పరిస్దితులు తెలుసుకునేందుకు పవన్ ఈ టూర్ లో పార్టీ ముఖ్య నేతలతో పాటు స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలతోనూ సమావేశం కాబోతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతాయని జనసేన పార్టీ ప్రకటించింది.
మూడు దశలుగా సాగే పవన్ టూర్ తొలి దశలో ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయి. రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు,వీర మహిళల సమావేశాలలో పాల్గొంటారు.మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టేనాటికి పవన్ మూడుసార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications