బాబుపై అసహనమా, ఓకే చెప్పారా: మోడీపై పవన్ కళ్యాణ్ సిద్ధమా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూమిపూజ చేసిన రోజునే (శనివారం) జనసేన పార్టీ కార్యకర్తలు విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదంటే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఇతర టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, దీనికి పవన్ కళ్యాణ్ అనుమతి ఉందా? లేదా? అనే చర్చ సాగుతోంది. రాజధాని కోసం రైతుల నుండి భూమిని బలవంతంగా లాక్కోవద్దని, అలా తీసుకుంటే తాను రోడ్డెక్కేందుకు సిద్ధమని పవన్ గతంలో పలుమార్లు ప్రకటించారు.
రాజధాని ప్రాంతంలో పర్యటించారు కూడా. ప్రత్యేక హోదా పైన బీజేపీ పైన విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే, రాజధాని భూమిపూజ సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రత్యేక హోదా పైన హంగామా చేయడం గమనార్హం.
దీనిపై వివిధ రకాల అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. రాజధాని కోసం రైతుల నుండి బలవంతంగా భూములు ఇచ్చారని, అలాంటప్పుడు భూమిపూజ ఇష్టం లేకనే జనసేన అలా చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఈ ఆందోళనకు పవన్ కళ్యాణ్ అనుమతి ఉందా లేదా అనే చర్చ కూడా సాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తున్నట్లు పవన్కు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ఓ నాయకుడు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన ఉద్యమిస్తారని తెలిపారు.