పవన్కల్యాణ్ చెప్పింది నమ్మాలా? పురంధేశ్వరి చెప్పింది నమ్మాలా?
భారతీయ జనతాపార్టీతో కరోనా వల్ల జనసేనకు భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోతే ఆ దూరం కూడా తగ్గిపోతుందని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గోదావరి గర్జన పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి వస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసే ఉద్దేశం లేదని, ఆ సమయంలో వేరే కార్యక్రమాలున్నాయని స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా శక్తి కేంద్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ నేత పురంధేశ్వరి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో బీజేపీకి, జనసేనకు మధ్య దూరం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

క్షేత్రస్థాయిలో ఉన్న దూరం పై స్థాయిలో లేదు
క్షేత్రస్థాయిలో దూరం ఉన్నప్పటికీ పైస్థాయిలో దూరం లేదని పురంధేశ్వరి చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉంటున్నామని, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి, కోనసీమలో అల్లర్ల వెనక ఎవరున్నారు? అప్పులు, రైతుల ఇబ్బందులు, పోలవరం గురించి మాట్లాడినట్లు వెల్లడించారు. జనసేనతో సంబంధం లేకుండా, చర్చించకుండానే ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. రాజమండ్రిలో గోదావరి గర్జన పేరుతో ఏర్పాటు చేసిన సభకు కూడా పవన్ కల్యాణ్ను ఆహ్వానించలేదని జనసేన వర్గాలు తెలిపాయి. మొదటి నుంచి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఏనాడూ పవన్ను ఆహ్వానించిందికానీ, ఆయనతో చర్చించిందికానీ లేదనేది సుస్పష్టం.

జనసేన, బీజేపీ మధ్య బంధం కొనసాగుతుంది??
బీజేపీ, జనసేన మధ్య బంధం కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో కలిసే పోటీచేస్తామని పురంధేశ్వరి విజయవాడలో చెప్పారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టేముందు జనసేనను సంప్రదించామని చెప్పారు. ఆ ఎన్నికల్లో జనసేన మద్దతిస్తోందని చెప్పారు. ఇంతకుముందే పవన్కల్యాణ్ జనసేన సిద్ధాంతాన్ని చెప్పారు. నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయినా మరణించినప్పుడు వారి కుటుంబంలోని వ్యక్తిని నిలబెడితే తాము అభ్యర్థిని నిలబెట్టడంలేదని చెప్పారు. ఆ పార్టీ సిద్ధాంతం అలా ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం అభ్యర్థిని నిలబెట్టింది.

ఇద్దరిలో ఎవరు చెప్పింది వాస్తవం?
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో జనసేన మద్దతునిస్తోందని పురంధేశ్వరి చెబుతున్నారు. కానీ పవన్ తమ పార్టీ సిద్ధాంతాన్ని తెలియజేశారు. ఇందులో ఎవరి మాట వాస్తవమనుకోవాలో అర్థం కావడంలేదని ఇరు పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆత్మకూరులో మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఆయన కుటుంబం నుంచి విక్రమ్రెడ్డిని వైసీపీ నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీది కూడా జనసేన సిద్ధాంతమే కావడంతో వారు కూడా అభ్యర్థిని నిలబెట్టలేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో కనీస బలం కూడా లేని బీజేపీ ఎందుకు అక్కడ అభ్యర్థిని నిలబెట్టింది? జనసేన మద్దతుందని చెబుతోంది? అనే విషయాలపై స్పష్టత రావాలంటే ఆ పార్టీ నేతలే పూర్తి విషయాన్ని వెల్లడించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications