తప్పులు పునరావృతమైతే ప్రశ్నిస్తా: పవన్ కళ్యాణ్
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో తప్పులు పునారవృతమైతే తాను ప్రశ్నిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డియె సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నరేంద్ర మోడీ హామీలను నెరవేరుస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెసు తప్పులు చేయడం వల్లనే తాము అధికారంలోకి వచ్చామని, మనం కూడా అవే తప్పులు చేస్తే అర్థం లేదని, అలాంటి తప్పులు జరిగితే ప్రశ్నిస్తానని ఆయన అన్నారు. తాను అధికారాన్ని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరులను దుర్వినియోగం చేశారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి విధానాలు సుదీర్ఘ కాలంలో నష్టం చేస్తాయని గ్రహించలేకపోయారని ఆయన అన్నారు.

అవసరం మేరకే సహజ వనరులను వాడుకోవాలని, పర్యావరణానికి అనుకూలమైన విధంగా వాటిని రాబట్టుకోవాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీకి తన వైపు సాయం చేస్తానని ముందుకు వచ్చానని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ పట్ల తనకు నమ్మకం ఉందని చెప్పారు. హమీలు ఆచరణ సాధ్యం కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తాను ఏమీ ఆశించడం లేదని, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలపై దృష్టి పెడుతానని ఆయన చెప్పారు. మెదక్ లోకసభ స్థానం నుంచి జగ్గారెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తానని ఆయన చెప్పారు.
నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడుల ప్రమాణస్వీకారాలకు తాను హాజరు కాలేకపోవచ్చునని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాంగ్రెసు విధానాలు దీర్ఘకాలికంగా సాగే పరిస్థితి లేదని, అందుకే ప్రజారాజ్యం వచ్చినప్పుడు తాను కాంగ్రెసును వ్యతిరేకించానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications