కర్ణాటక కంటే రసవత్తరం: పవన్ 'కింగ్ మేకర్' ఆశలు, అదే జరిగితే చుక్కలే!
Recommended Video

అమరావతి/విశాఖపట్నం: 2019 ఎన్నికల్లో ఏపీలో కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు కనిపిస్తాయా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన కేడర్ ఆ అభిప్రాయంతో ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీల్లాగే పవన్ కూడా ధీమాగా ఉన్నారు. బలమైన ముక్కోణపు పోటీ నేపథ్యంలో ఎవరికీ మెజార్టీ సీట్లు రాకుంటే తాము కింగ్ మేకర్ అవుతామని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది.
అదే జరిగితే అధికారంలో ఉన్న పార్టీని ప్రజాసమస్యలపై పవన్ ఓ ఆట ఆడుకోవడం ఖాయమని చెబుతున్నారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎదుటకు పలు సమస్యలు తీసుకు వచ్చి, వాటి పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన అండతో గట్టెక్కితే ప్రజా సమస్యలపై వారిని నిత్యం సభలో, బయట నిలదీసే అవకాశముంటుందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్
వచ్చే ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్ కావొచ్చునని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య రసవత్తర పోరుకు అవకాశముంది. పవన్ ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. కర్ణాటకలో మనం చూసిన ఫలితాల కంటే మరింత రసవత్తరంగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని జనసేనాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజలు తీర్పు చెబుతారు
తాము మంచి సీట్లు సాధిస్తామని, అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది, అలాగే ఎంత రసవత్తరంగా ఉంటుందనేది ప్రజల తీర్పు చెబుతుందని పవన్ అన్నారు. 2014లో టీడీపీకి మద్దతివ్వడానికి కారణం ఉందని చెప్పారు. 14 నుంచి 16 శాతం ఓటు షేర్ వారికి పడిపోతుందని అభిప్రాయపడ్డారు.

చిరంజీవి పార్టీ నుంచి పాఠాలు
2009లో తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఏపీలో 25 శాతం ఓట్లు సాధించిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అది ప్రజారాజ్యం బలం అన్నారు. ప్రజారాజ్యం పార్టీ లోపాలను తిరిగి పునరావృతం కాకుండా చూస్తున్నామని చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవం తనకు ఉందని చెప్పారు.

లెఫ్ట్తో ఎందుకు వెళ్తున్నానంటే
ప్రస్తుతం పార్టీలు తమకు అనుకూలంగా ఆయా అంశాలపై అభిప్రాయం మార్చుకుంటున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు. తాము ఏం చేస్తున్నామనే దానిపై ఏ పార్టీకి పూర్తి స్పష్టత లేదన్నారు. లెఫ్ట్ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతాయని, అందుకే ఆ పార్టీలతో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇతర పార్టీలను కూడా చేర్చుకునే అంశం పరిశీలిస్తామని, రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదు, ఎవరూ మిత్రులు కాదన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏపీలో రిపీట్ అయితే పవన్ కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications