పిఠాపురం మహిళలకు పవన్ శ్రావణ మాసం గిఫ్ట్..!!
డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం పిఠాపురం ఆడపడుచులకు సొంత నిధులతో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేకంగా చీర, అమ్మవారి ప్రసాదాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పిఠాపురం ఆడపడుచుల కోసం పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తి కర చర్చగా మారింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఆగస్టు 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పిఠాపురంలో జరుగుతున్న వేడుక కావటతో జనసేన నేతలు ప్రత్యేకంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక పూజ సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఆలయ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ పూజ కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్ల పైన ఆలయ అధికారులతో సమీక్షించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేయమని.. స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారు. మొత్తం 12 వేల చీరలు పంపించారు. ఆలయం వద్ద వ్రతం అనంతరం పసుపు, కుంకుమ, చీర పంపిణీ చేయనున్నారు.
వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తురాలికి ప్రసాదం అందేటట్లు తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూడు గ్రూపులుగా ఈ వ్రతం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూడాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు. గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వ్రతంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications