ప్రఖ్యాత బాసర ఆలయంలో భారీ చోరీ- సీసీటీవీ ఫుటేజీలో.. !!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో మహంకాళి ఉపగుడిలో గుర్తుతెలియని దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీలోని నగదును దోచుకెళ్లారు. అత్యంత భద్రత ఉండే బాసర క్షేత్రంలో ఈ ఘటన జరగడం భక్తులను, దేవాలయ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఉదయం పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాలయమైన మహంకాళి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, గర్భాలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని అపహరించారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. మరో ఉప ఆలయం సమీపంలో నగదు మొత్తం తీసుకుని ఖాళీ హుండీని అక్కడే వదిలేశారు.

ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రవేశించడం ఇందులో స్పష్టంగా రికార్డయింది. వారిలో ఒకరి చేతిలో ఓ చిన్నపాటి వస్తువు ఉండటాన్ని ఇందులో చూడొచ్చు.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగానే ఈ దొంగతనం ఎలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాసర ఆలయంలో భద్రతా వైఫల్యాలు బయటపడటం ఇది మొదటిసారి కాదు. 2024 ఆగస్టు 15న కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అప్పట్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి హుండీ తాళాలు పగలగొట్టి భారీగా నగదును, బీరువాలోని విలువైన వస్తువులను అపహరించాడు.
ఆ కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ చోరీ ఘటనపై జ్ఞాన సరస్వతి అమ్మవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 20 లక్షల మంది దేవాలయాన్ని దర్శించుకుంటారు.
ఆలయానికి కానుకల రూపంలో దాదాపు 20 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం వస్తున్నప్పటికీ, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. నిరంతరం నిఘా ఉండే ఆలయ ప్రాంగణంలో తాళాలు పగలగొట్టి దొంగతనం చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు. అత్యాధునిక నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications