పీఆర్పీని చూసి భయపడితే, ఆ తల్లి కళ్లు తెరిస్తే: బాబుకు పవన్ హెచ్చరిక, జగన్పైనా
Recommended Video
అనకాపల్లి/చోడవరం: ప్రజారాజ్యం పార్టీలో నెరవేరని ఆశయాలు సాధించడానికే జనసేనను స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, అంతకుముందు అనకాపల్లిలో ఆయన మాట్లాడారు. విభజన సమయంలో ఉత్తరాంధ్రకు కావాల్సిన అంశాలను ఏ నాయకుడూ లేవనెత్తలేదని మండిపడ్డారు.
పక్కా ప్లాన్తో పర్యటన, దాడితో పవన్ భేటీ: జనసేనలోకి విశాఖ ఎంపీగా పోటీ చేసిన నేత
జనసైనికులు మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరు కూడా భయపడి పారిపోకూడదన్నారు. ఎదురు తిరగాలన్నారు. నేను కోరుకున్నది జవాబుదారీతనంతో కూడిన సరికొత్త రాజకీయ వ్యవస్థ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను, వాటి పరిష్కారాలను పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆరోపించారు.
ఏం.. మీరేం చేసినా చూస్తూ ఊరుకోవాలా?
నేను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అంటున్నారని పవన్ విమర్శించారు. మీరు ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోవాలా అన నిప్పులు చెరిగారు. టీడీపీ, వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర భూములను కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. టీడీపీకి మద్దతిచ్చామని, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు ఏం చేశారో, ఏం చేయలేదో తెలుసునని చెప్పారు. రైల్వే జోన్ గురించి మాట్లాడతే.. జోన్ లేదు, గీను లేదన్నారని, అది బాధేసిందన్నారు. అవంతి తనకు, తన కుటుంబానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని, రేపు ఎదురుగా నిలబడితే నమస్కారం కూడా పెడతానని, కానీ ఈ రోజు వరకు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నానని అన్నారు.
నా అన్నయ్యను కాదనుకొని నీకు మద్దతిచ్చా
నేను ఏమీ ఆశించకుండా, చిన్న పదవి ఆశించకుండా తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని, కానీ టీడీపీ ఇలా చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు అసలు తన కొడుకు చేసే దోపిడీని ఆపలేకపోతున్నారని మండిపడ్డారు. మీ ఇంట్లో వారిని గొడవలు వస్తాయని ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కానీ నిజాయితీగా నిలబడిన తన అన్నయ్య చిరంజీవిని కాదనుకొని ప్రజాశ్రేయస్సు కోసం టీడీపీకి అండగా నిలబడితే మీరు మాకు ఇచ్చింది తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మూసేశారన్నారు.
ఆ తల్లి కళ్లు తెరిస్తే ఏమవుతారో తెలియదు
ఏదీ తెలుగుదేశం పార్టీ సొత్తు కాదని పవన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పీలా గోవింద రావు సహా ప్రతి శాసన సభ్యుడు అర్థం చేసుకోవాల్సింది ఇది మీ సొత్తు కాదని, ప్రజల సొత్తు అన్నారు. ఇది ఉత్తరాంధ్ర సొత్తు, దేశం సొత్తు అన్నారు. నేతలు ఎలా తయారయ్యారంటే.. తల్లి నూకాలమ్మ దగ్గరకు వెళ్లి తాను కిలో వెండి కిరీటం చేయిస్తానని మొక్కు కుంటారని, కానీ బెదిరించి, చందాలు వసూలు చేసి దానిని చెల్లిస్తారని, కానీ వీరికెవరికీ తెలియదని, తల్లి నూకాలమ్మ కళ్లు తెరిస్తే ఏమవయిపోతామో వీరికి తెలియదన్నారు. మొక్కు నువ్వు మొక్కుకొని, డబ్బులు అందరి వద్ద నుంచి తీసుకుంటావా.. అప్పుడు ఆ తల్లి దీవెనలు నీకు ఎందుకు వస్తాయని, అందరికీ వెళ్తాయని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా, యూట్యూబ్, వెబ్ సైట్స్ ఉన్నాయి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క పర్యటన ఆపితే రూ.2 కోట్లు మిగులుతుందని, దాంతో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని, నవ నిర్మాణ దీక్ష ఆపినా సరిపోతుందని పవన్ అన్నారు. ఇది పాతకాలం కాదని గుర్తుంచుకోవాలని, ఎప్పుడో యాభయ్యేళ్ల క్రితం ఏదో చేశానని చెబుతారని, కానీ సోషల్ మీడియా, యూట్యూబ్, వెబ్ సైట్స్ ఉన్నాయని, ప్రతి మాట రికార్డ్ అవుతుందని, దీనిని గుర్తుంచుకోవాలని చంద్రబాబు, టీడీపీ నేతలకు హితవు పలికారు. ఇది పాతకాలం కాదని, సరికొత్త కాలం కాదన్నారు. ఇలాంటి వారి వద్ద మాటలతో మభ్యపెడతానంటే కుదరదన్నారు. 30వేల మంది ఆధారపడి ఉన్న తుమ్మపాల ప్రాజెక్టును తిరిగి ప్రారంభింప చేయాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు.
పీఆర్పీని చూసి నేను భయపడితే వారు గెలుస్తారు
ఉత్తరాంధ్రలో వేర్పాటువాద ఆలోచనలు వస్తే కానుక దానికి వలసపక్షులు, టీడీపీ నేతలే కారణం అవుతారని పవన్ అన్నారు. నేను పారిపోయే వ్యక్తిని కాదని, నిలబడే వ్యక్తిని అన్నారు. సినిమాకు కోట్ల రూపాయలు తీసుకునే సత్తా ఉండి కూడా నేను వాటిని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయం బాధ్యత కాబట్టి సినిమాలు వదిలేశానని చెప్పారు. సినిమాల్లో వంద మాటలు మాట్లాడుతామని, కానీ బయట ఎవరు మాట్లాడుతారన్నారు. నాస్థాయి వ్యక్తి కూడా ప్రజారాజ్యం పార్టీ ఓటమికి భయపడి రాజకీయాలు మనం చేయలేమని చెప్పి వెనక్కి వెళ్లిపోతే దుర్మార్గులు, దోపిడీదారులు గెలిచినవాళ్లవుతారని ఆవేశంగా అన్నారు. వీళ్లు గెలవకూడదన్నారు. శత్రువులకు వెన్నుచూపవద్దని, ప్రజాక్షేత్రంలో పోరాడాలన్నారు. కష్టాలు, నష్టాలు ఉంటాయని, మాటలు పడతామని, దాడులు ఎదుర్కొంటామన్నారు.
జగన్! మూడేళ్లు ఏం చేశావ్
జనసేన లేకుంటే టీడీపీ, వైసీపీలు సిండికేట్ అయ్యేవారని పవన్ ఆరోపించారు. నేను వస్తున్నానని తెలిసి హఠాత్తుగా తుమ్మపాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో కూర్చొని అడగాలని, తుమ్మపాలను మూసివేస్తే మూడున్నరేళ్లుగా ఏం చేశారని జగన్ పార్టీని ప్రశ్నించారు. కానీ జగన్ మాత్రం నేను సీఎంను అయితే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెబుతారని, ఇదే మాట అన్నారు. ఫ్యాక్టరీ మూత వల్ల ఆకలి చావులు చోటు చేసుకున్నాయని, దీనికి టీడీపీ, వైసీపీలు బాధ్యత వహించాలన్నారు. అసెంబ్లీలో పోరాడటం కోసం తప్ప అసెంబ్లీ నుంచి బయటకు రావడానికి కాదన్నారు. తమకు ఒక్క ప్రజాప్రతినిధి లేకున్నా కోట్లాది ప్రజల అండ ఉందన్నారు. ఎంపీలకు ప్రజా సమస్యలపై లేఖ రాసేందుకు బద్దకం అన్నారు. అవంతికి చిత్తశుద్ధి ఉంటే పీలా అవినీతి ఆపేవారన్నారు.
నేను తప్పు చేసే వ్యక్తిని కాదు
నేతలు తప్పులు చేస్తే నేను వెనుకేసుకొచ్చే వ్యక్తిని కాదని, నిలదీస్తానని చెప్పారు. తుమ్మపాల ప్రాజెక్టు టీడీపీ తెరిపించకుంటే జనసేన తెరిపిస్తుందని పవన్ చెప్పారు. మైనింగ్ శాఖకు సుజయ కృష్ణ రంగారావు మంత్రి అని, మీరే రాజులు అని, మీరే ఉత్తరాంధ్ర వారు అని, మీలాంటి వారు అనారోగ్యానికి గురి చేస్తే ఎలాగని ప్రశ్నించారు. కాగా, పవన్ మాట్లాడుతుండగా అభిమానులు, జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినదించారు. చివరగా స్థానికులు జనసేనానికి నూకాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గారు, నూకలమ్మ తల్లి అంటే ఈమే, మీరు మొక్కుకున్నరు ఈమెకే, ఆవిడ ఆశీస్సులు మీకు కాదని, నూకాలమ్మ మిమ్మల్ని కచ్చితంగా శపిస్తుంది గుర్తుంచుకోండి అన్నారు.