Pawan Kalyan: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ -పవన్ కళ్యాణ్ థ్యాంక్స్...
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు విషయంలో సందిగ్ధత నెలకొన్న వేళ ప్రస్తుతం ఉన్న గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం పంపింది. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసీ నిర్ణయంపై స్పందించారు.వచ్చే ఎన్నికలకు గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారని పవన్ తెలిపారు.

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకమని ఈసీ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ ఉంటుందా లేదా అన్న చర్చ సాగుతోంది. గాజు గ్లాస్ గుర్తు కొనసాగకపోతే మరో గుర్తు ఎంచుకోవాల్సిన పరిస్ధితి కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం జనసేనకు ఊరట కలిగించినట్లయింది.












Click it and Unblock the Notifications