చంద్రబాబు ఆలోచనకు భిన్నంగా పవన్ ? జగన్ కు కీలక సలహా..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు నిన్న మొన్నటివరకూ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా గొంతు సవరించుకుంటున్నారు. మరికొందరు కొత్త కొత్త అంశాల్ని తెరపైకి తెస్తున్నారు. ఇంకొందరు తమ వ్యూహాలు వర్కవుట్ కావని భావించి పూర్తిగా వాటిని మార్చుకుంటున్నారు. దీంతో చాలా సందర్భాల్లో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియక సామాన్యులు జుట్టు పీక్కోవాల్సిన పరిస్ధితి.
ఏపీలో నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో విపక్ష టీడీపీ, జనసేన దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఓవైపు సంక్షేమం లబ్దిదారులకు సక్రమంగా అందడం లేదని, మరోవైపు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని జగన్ పై దుమ్మెత్తి పోశాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు రూటు మార్చి మరింత సంక్షేమం అమలు చేస్తానని ముందుకొచ్చారు. కానీ పవన్ మాత్రం ఇప్పటికీ ఉచిత సంక్షేమ పథకాల్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన వీర మహిళలతో భేటీ అయిన పవన్.. ఉచితాలు బదులు ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తే రాష్ట్రం అప్పులు పాలు కాదని చెప్పారు. దీంతో వీర మహిళలు కూడా అమ్మఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తే పిల్లలకు నాణ్యమైన చదువు రాదని నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తే పిల్లలకు మంచి చదువు వస్తుందని తమ మనసులో మాట చెప్పారు. దీంతో పవన్ జనసేన ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతానుసారం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే సంక్షేమంపై వైసీపీ, టీడీపీ కంటే భిన్నంగా ఆయన ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా ఇవాళ వీర మహిళల భేటీలో పవన్ వ్యాఖ్యల బట్టి చూస్తే ఉచిత పథకాల కంటే ఉపాధి కల్పించే పథకాలపై జనసేన దృష్టిసారించే అవకాశం ఉంది. మరి పొత్తులతో ఎన్నికలకు వెళ్తే ఈ అంశంలో పవన్ మిత్రులైన చంద్రబాబు, బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సంక్షేమానికి అలవాటు పడ్డ జనాన్ని గుర్తించే చంద్రబాబు, బీజేపీ తాము అధికారంలోకి వస్తే సంక్షేమం మరింత పెంచుతామని హామీ ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications