ఎన్టీఆర్ తర్వాత.. తెలుగోడి దెబ్బ: మోడీకి పవన్ వార్నింగ్, ఆమరణదీక్ష అవసరమొస్తుందా?
Recommended Video
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రైల్వే జోన్ కోసం అవసరమైతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, అవసరమైతే కాదు.. అవసరం పడుతుందనుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరు సభలో ప్రకటించారు.
చదవండి: చంద్రబాబు దుమ్ముదిలిపిన పవన్ కళ్యాణ్
తాను యువతను బలిదానాలు అడగనని, అవసరమైతే తానే బలిదానం అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుడి ఆత్మగౌరవం భారత దశ ప్రభుత్వానికి రుచి చూపిద్దామన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నడుద్దామన్నారు. అయితే పవన్ హోదాను తీసుకు రాగలడా అనే చర్చ సాగుతోంది.
ప్రత్యేక హోదాపై ఇప్పటికే తేల్చేసిన కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఇప్పటికే తేల్చేసింది. ఏ రాష్ట్రానికి ఇప్పుడు హోదా లేదని, ఏపీకి ఇవ్వలేమని చెప్పింది. దానికి బదులు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో పవన్ హోదా సాధన కోసం దీక్ష చేస్తారా లేక సమానమైన లాభం వస్తే ఊరుకుంటారా అంటే.. హోదా కంటే ఏపీకి ఆర్థిక లాభం కలిగితే చాలనేది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు.
హోదా కోసం ఉద్యమం
ప్రత్యేక హోదా కోసం చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు టీడీపీ, వైసీపీలు నాలుక మడతేశాయనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు అవి కూడా హోదా కోసం పట్టుబడుతున్నాయి. ఇన్నాళ్లుగా పోరాడినా హోదా లేదని తేల్చిన కేంద్రం పవన్ పోరాడితే ఏ మేరకు స్పందిస్తుందని అంటున్నారు.
తెలంగాణ తరహా ఉద్యమం
ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ అవసరమైతే తెలంగాణ తరహా ఉద్యమానికి ముందుకు రావొచ్చని అంటున్నారు. అయితే ఆయన పదేపదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ప్రజలను ఏకం చేసి, ఉద్యమిస్తారని, 2019 ఎన్నికల తర్వాత మరింత తీవ్రంగా ఉద్యమిస్తారా అనే చర్చ సాగుతోంది.
ఉద్యమం చేసే అవసరం వస్తుందా
మరో విషయం ఏమంటే అసలు పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష చేసే అవసరం ఏర్పడుతుందా అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే 2019లో తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి వారు అధికారంలోకి వస్తే ఇచ్చే అవకాశముంది. అయితే మళ్లీ మోడీ ప్రభుత్వమే వస్తుందని భావిస్తున్నారు కాబట్టి దీక్ష చేసే అవసరం ఏర్పడినా ఏర్పడుతుందని అంటున్నారు.
సరదాగా దులుపుకెళ్లం
తన ప్రసంగంలో చంద్రబాబు దుమ్ముదులిపిన పవన్ కళ్యాణ్ హోదా, రైల్వే జోన్ అంశాలతో కేంద్రంపై మండిపడ్డారు. ఆంధ్రుడి ఆత్మగౌరవం ఢిల్లీకి రుచి చూపిద్దామన్నారు. పోరాటం చేస్తామని, రోడ్లపైకి వస్తామన్నారు. హోదాపై సరదాగా చేతులు దులుపుకెళ్లమని చెప్పారు. నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తే, ఇప్పుడు పవన్ మోడీకి చుక్కలు చూపిస్తారా అనే చర్చ సాగుతోంది.
కేంద్రానికి హెచ్చరిక
ఆమరణ నిరాహార దీక్షకు ఈ రోజు నుంచి ఎప్పుడైనా సిద్ధమని పవన్ ప్రకటించారు. కేంద్రం ఏదో సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు. తెలుగువాడి తెగింపు కేంద్రానికి తెలియాలన్నారు. నా బలిదానంతో ఏపీకి మంచి జరుగుతుందంటే అందుకు సిద్ధమన్నారు. తన ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏం జరుగుతుందో తన చేతుల్లో లేదని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు.
ఉద్దానం కోసం పవన్ కళ్యాణ్ రావాలా
గుంటూరు సభలో పవన్ చంద్రబాబుపై మండిపడ్డ విషయం తెలిసిందే. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ రావాలా అని చంద్రబాబును ప్రశ్నించారు. అక్కడి నేతలకు అది తెలియదా అన్నారు. నేను హార్వార్డ్ డాక్టర్లను తీసుకువస్తే మీరు ఏం చేశారన్నారు. అక్కడ జరిగింది కొంతేనని, చేయాల్సింది కొండంత అన్నారు. వాళ్లు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. కుల, మత గొడవలపై మాట్లాడుతూ.. అవకాశాలు, అభివృద్ధి అందరికి కావాలన్నారు. అధికారం కొన్ని కులాల గుప్పెట్లో ఉండవద్దన్నారు. ఉత్తరాంధ్ర నంచి ప్రజలే ఎందుకు వలస వెళ్తున్నారని, బొత్స లాంటి వారు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ వెనుకబాటుకు ప్రకృతి ఒక కారణం అయితే, నాయకులు రెండో కారణం అన్నారు. ఎంతమంది సీఎంలు వచ్చారని, చంద్రబాబు కూడా సీమ వ్యక్తే అన్నారు. తూర్పు ఆంధ్రా టీచర్లు తెలంగాణలోనే ఉండిపోయారన్నారు. దశాబ్దాలుగా పాలక వర్గాలు చేస్తున్న తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవంచాలన్నారు. ఏపిలో ఇన్ని సమస్యలు ఉండగా 29సార్లు ఢిల్లీ వెళ్లానని, పట్టించుకోవడం లేదని చంద్రబాబు అంటారని, కానీ మొదట మన బంగారం మంచిది కావాలన్నారు. ఓటుకు నోటు సమయంలో తాను మాట్లాడలేదని అందరూ తనను తిట్టారని, కానీ అప్పటి పరిస్థితిని బట్టి మాట్లాడలేదన్నారు. నేను ఆశించింది ఏదీ టీడీపీ ప్రభుత్వం చేయలేదన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి అవినీతి గురించి ఎంతో చెప్పారని, మరి చంద్రబాబు చేస్తుందేమిటని నిలదీశారు. వైసీపీ వస్తే దోపిడీ పెరుగుతందన్నారని, మీరు చేస్తుంది అదే కదా అన్నారు. పోరాటం చేస్తే పోయేదేం లేదని, బానిస సంకెళ్లు తప్ప అన్నారు. తెలుగు తల్లికి ద్రోహం చేశారని, అందరికీ అండగా ఉంటే కనకదుర్మ్మ వారిని కూడా దోపిడీకి ఉపయోగించుకున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.