ఆ ఆగ్రహం ముందే తెలుసా: పవన్Xబాబు, రాజధానికి 25 ఏళ్లు కావాలని..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన రాజధాని పర్యటనలో ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందే ఊహించారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ విమర్శలు, దానికి చంద్రబాబు, ఆ పార్టీ నేతల ప్రతిస్పందన చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
నాలుగు రోజుల క్రితం.. ఆదివారం నాడు పవన్ హైదరాబాదులో చంద్రబాబును ఆయన నివాసానికి కలిశారు. ఇరువురు దాదాపు గంటన్నరకు పైగా మాట్లాడుకున్నారు. అయితే, భేటీ అనంతరం ఇరువురు నేతలు ఏం మాట్లాడుకున్నారనే విషయం స్పష్టంగా బయటకు రాలేదు. కేంద్ర బడ్జెట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. బాబుకు మద్దతుగా నిలబడతానని చెప్పారని, అలాగే రాజధాని రైతుల సమస్యలను అడిగారని భావించారు.
అయితే, భేటీలో పవన్ ఏపీ సీఎంను రాజధాని రైతుల సమస్యల పైన గట్టిగా అడిగినట్లుగా కూడా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే నాడు వచ్చిన ఊహాగానాలు నిజమే కావొచ్చునని అంటున్నారు. రాజధాని రైతుల సమస్యల పైన చంద్రబాబును నిలదీసిన మాటలో నిజమెంత ఉన్నా.. ఒకింత గట్టిగానే అడిగి ఉంటారని అంటున్నారు.
పవన్ వ్యాఖ్యలకు చంద్రబాబు పరోక్షంగా కౌంటర్
రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రైతులకు ఇష్టం లేకుంటే భూమిని లాక్కోవద్దని చెప్పారు. తాను మాట్లాడుతానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఘాటుగా హెచ్చరించారు. ఈ రాజధాని రాజధాని మంటలపై చంద్రబాబు స్పందించారు.
రాజధాని అంటే వెయ్యి ఎకరాల్లో కట్టవచ్చూ, ఐదు వేలు ఎకరాల్లో కట్టవచ్చునని చంద్రబాబు అన్నారు. ఆ విధంగా రాజధాని నిర్మిస్తే ఆ భూమికి విలువ రాదని ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విమర్శించారు. అక్కడ వరల్డ్ క్లాస్ కంపెనీలు వస్తాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని చంద్రబాబు అన్నారు.
దీంతో అక్కడ ఉండేవారి భూములకు విలువ వస్తుందన్నారు. భూములకు విలువ లేకపోతే రైతులు వ్యవసాయం చేసుకోవచ్చునని, అప్పుడు ఎరరాకు ఏడాదికి ఆదాయం రూ.50 వేలు లేదా రూ.లక్ష వస్తుందన్నారు. పవన్ అనుమానాలు నివృత్తి చేస్తామని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ అన్నారు.
మరోవైపు, పవన్ మాట్లాడుతూ.. రాజధాని అభివృద్ధికి భూమి కావాలని, రైతుల వద్ద నుంచి గానీ, ఇంకా ఎవరి వద్ద నుంచైనా భూములు తీసుకుంటే దానికి సరైన న్యాయం జరగాలన్నారు. దానికోసం కూడా ఒక పోరాటం చేయాలన్నారు. రాజధానికి 5 వేలు లేక 8 వేల ఎకరాలు అవసరమా? అనే ఆలోచన తనకు ఉందన్నారు.
కాగా, పవన్ పర్యటన పైన ఐదు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, దీని పైన టీడీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. పవన్ తమకు అనుకూలంగా పర్యటిస్తే ఇప్పటికే ఆ వర్గాలు పెదవి విప్పేయని, ఎలాగూ విమర్శిస్తారని తెలిసే... ఆయన విమర్శల తర్వాత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు.
రాజధాని నిర్మాణానికి కనీసం ఇరవై ఏళ్లు
ఇష్టం లేని గ్రామాలను రాజధాని నిర్మాణంలో కలపవద్దన్నారు. 90 శాతం ఇచ్చారు, పది శాతం లాక్కుంటామంటే కుదరదన్నారు. తాను రాజధానికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని నిర్మాణానికి కనీసం ఇరవై ఏళ్లు పడుతుందని అనుకుంటున్నానని చెప్పారు.