వైసీపీ మళ్లీ రాదు.. ! పిచ్చి బెదిరింపులొద్దు- జగన్ కు పవన్ వార్నింగ్..!
జగన్ నియంతృత్వ విధానాలు మారలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు సభలో పవన్ వైసీపీకీ, జగన్ కూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్య విధానాలపై వైసీపీకి నమ్మకం లేదన్నారు. విదేశాల్లో ఉన్నా వెంటాడుతామన్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని అస్సలు సహించబోదన్నారు. గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడబోమన్నారు. ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు.
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు, అవినీతి రహితంగా ముందుకెళ్లాలని అధికారుల్ని పవన్ కోరారు. మళ్లీ ఆ ప్రభుత్వం రాదు, రాబోదని పవన్ తేల్చిచెప్పారు. 15 నుంచి 20 ఏళ్లు ఉండాలని అనుకున్నది వికసిత్ భారత్ కోసమేనన్నారు. రోడ్లపైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని గొంతుకలు కోస్తామని సినిమా డైలాగులు చెప్తే మక్కెలు విరగ్గొట్టి కూర్చుబెడతామన్నారు. తాము సరదాగా లేమని, చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చామన్నారు.

ఏపీ బాగు కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ఐదేళ్లు విధ్వంసకర పాలన జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబును గత పాలకులు ఎంతో ఇబ్బంది పెట్టారని, ఏదన్నా మాట్లాడాలంటే భయపడే పరిస్ధితి ఉండేదన్నారు. అధికార యంత్రాంగం కూడా నిస్సహాయంగా చూసే పరిస్ధితి ఉండేదన్నారు. విశాఖలో తనను కూడా అడ్డుకున్నారని, ఇలాంటి పరిస్ధితుల్లో మళ్లీ సాధారణ రోజులు వస్తాయా అనిపించేదన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అప్పట్లో విలవిల్లాడిపోయారన్నారు. అందుకే సుపరిపాలన కోసం తాము కూటమిగా ఏర్పడ్డామన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఓ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. దాన్ని ప్రజలు ఆమోదించి ఏడాది పాలన పూర్తి చేసుకున్నామన్నారు.
వికసిత్ భారత్ కోసం విజన్ 2047 అజెండాతో మందుకెళ్తున్నామని, తాజాగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం తనకెంతో నచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని, ఇందులో పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ నిర్వహణ, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ వంటివి ఉన్నాయన్నారు. తన పంచాయతీరాజ్ శాఖలోనూ భారీ ఎత్తున నిధుల్ని కేటాయిస్తున్నట్లు పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications