రేపు ఇచ్చాపురంలో పవన్ రోడ్ షో: ఏర్పాట్లపై జనసేన ఫోకస్..
ఇచ్చాపురం నిర్వహించే 'రోడ్ షో' తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి జనం ముందుకు రానున్నారు.
శ్రీకాకుళం: రాయలసీమ బహిరంగ సభ తర్వాత శ్రీకాకుళంలో నిర్వహించే 'రోడ్ షో' తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి జనం ముందుకు రానున్నారు. మంగళవారం నాడు పవన్ శ్రీకాకుళం పర్యటన ఖరారైన సందర్బంగా.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి.
జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్యటన సందర్బంగా.. తొలుత జిల్లాలోని ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పవన్ పరామర్శించనున్నారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
ఆయన పరామర్శించబోయే రోగుల జాబితాను ఇప్పటికే జనసేన కార్యకర్తలు సిద్దం చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల పరామర్శ అనంతరం అక్కడే నిర్వహించే రోడ్ షో లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జనసేన శ్రేణులు మీడియాకు వెల్లడించాయి.
ట్విట్టర్ ద్వారా పవన్ స్పందన:
ఉత్తర కోనసీమగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో గత ఇరవై ఏళ్లలో 20వేల మందికి పైగా మృత్యువాతపడ్డారని జనసేన అధ్యక్షుడు పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక్కడ లక్షల మంది ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నా ్రపభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జనసేన పార్టీ తరుపున కొంతమంది విలేకరుల బృందం అక్కడి ప్రజలను కలుసుకుని వారి సమస్యలపై ఓ డాక్యుమెంటరీ తయారు చేసిందని పవన్ వెల్లడించారు.
జనసేన రూపొందించిన ఈ వీడియోను చూసి అక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా పవన్ కోరారు. కాగా, ఆయన ఈ సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. రేపు ఉద్దానంలో కిడ్నీ పేషెంట్స్ ను పరామర్శ అనంతరం రోడ్ షో లో పాల్గొంటారు.