కింగ్ మేకర్గా పవన్: రెండు పార్టీల్లో గుబులు, టిలోను
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జనసేన ప్రభావంపై సీమాంధ్ర, తెలంగాణలోని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ పార్టీ విధి విధానాల సంగతి ఎలా ఉన్నా, ప్రశ్నించే పార్టీ అని కొన్ని స్ధానాలకే పరిమితమై పోటీ చేస్తామని పవన్ వర్గాలు లీకులు ఇవ్వడంతో రాజకీయ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెసు సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావులు పవన్పై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు ఒకడుగు ముందుకెళ్లి పవన్ తమతో చేతులు కలపాలని కోరడం గమనార్హం.
చిరంజీవి ప్రజారాజ్యం గత ఎన్నికల్లో 18 సీట్లు సాధించినా, చాలా మందిని ఓడించింది. ఈసారి మళ్లీ తమకు అదే గతి పడుతుందనే భయం టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను వెంటాడుతోంది. పవన్ పార్టీతో సంబంధం లేదని నాగబాబు ప్రకటించడాన్ని రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు.

తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డజను అసెంబ్లీ స్ధానాలపై పవన్ గురి పెట్టారు. మల్కాజగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ స్ధానాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీని వల్ల ఇక్కడ టిడిపి, కాంగ్రెస్ పార్టీల గెలుపు అనుకున్నంత సులువు కాదు.
సీమాంధ్రలో కాకినాడ, కొత్తపేట, తణుకు, అమలాపురం, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని పవన్ కదులుతున్నట్లు సమాచారం. సీమాంధ్రలో 88 అసెంబ్లీ సీట్లు, తెలంగాణలో 60 సీట్లు తెచ్చుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది.
తాము అధికారంలోకి రాకపోయినా, యువతను ఆకర్షించి, ప్రశ్నించే ధోరణిని వారిలో పెంచి, ఓటు బ్యాంకులను విచ్ఛిన్నం చేసి అక్కడ, ఇక్కడ చేరో పది సీట్లు తెచ్చుకున్నా, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే చక్రం తిప్పవచ్చన్న ఆశతో పవన్ కళ్యాన్ ఉండవచ్చునంటున్నారు. చిరంజీవి ఎక్కడ విఫలమయ్యారో తాను అక్కడ విజయం సాధించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications