పవన్ పరామర్శతో అభిమాని చిన్నారి శ్రీజ కోలుకుంది, పుట్టినరోజు కూడా జరిపారు
హైదరాబాద్: ‘ఎక్యూట్ డిస్సెమినేటెడ్ ఎన్సెఫలోమైలైటిస్'తో 3 నెలలుగా ఖమ్మంలో చికిత్స పొందుతుంది చిన్నారి శ్రీజ. ఆమె చివరి కోరిక మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లి కంటతడి పెట్టిన సంగతి గుర్తుంది కదా.. ? ఇప్పుడు ఆ పాప క్షేమంగా ఉంది.
ఆదివారం ఆస్పత్రిలోనే 13వ పుట్టినరోజు వేడుక చేసుకుంది. అక్టోబర్ 2న ఆమె ప్రాణాపాయ స్థితిలో వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, మరికొంత కోలుకున్నాక ఈ వారంలోనే డిశ్చార్జ్ చేస్తామని.. చిన్నారి శ్రీజకు వైద్యం చేస్తున్న కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అసాధారణ్ తెలిపారు.
శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై అందరూ వాకబు చేస్తుండటంతో ఆస్పత్రిలోనే జన్మదిన వేడుక జరిపి, విలేకరులను పిలిచి, అందరికీ ఆమె పరిస్థితి తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శ్రీజ కూడా మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను' అని చెప్పింది.

ఈ సందర్భంలో శ్రీజ తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ ఆస్పత్రిలో 21రోజులు శ్రీజను ఐసీయూలో ఉంచినా, చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, కొందరి సలహా మేరకు ఖమ్మం తీసుకొచ్చామన్నారు. చిన్నారి శ్రీజ కోలుకోవడంలో డాక్టర్ అసాధారణ్, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.
ఆమెను పరామర్శించిన పవన్ కళ్యాణ్కు, ఆర్థిక సహాయం చేసిన పవన్ అభిమానులకు, ఆమెకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, కేటీపీఎస్లోని తన తోటి ఉద్యోగులకు, పవన్ కళ్యాణ్ రాక కోసం కృషిచేసిన ‘మేక్ ఎ విష్' సంస్థకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
‘శ్రీజా.. నేను పవన్ కళ్యాణ్ని వచ్చాను లేమ్మా'.. అక్టోబర్ 17న ఆమెవద్దకు వచ్చిన పవన్కల్యాణ్ పలకరించారు. ఆ రోజు అరగంట శ్రీజ వద్దే కూర్చున్న పవన్ కళ్యాణ్ ఒకదశలో కంటతడిపెట్టడం తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి.. శ్రీజ తప్పకుండా కోలుకుంటుందని, ఆ విషయం తెలిపితే మళ్లీ వస్తానని వారికి భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications