ఈ నెల 25న తిరుమలలో..: భక్తులకు అపురూప దర్శనం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు రోజు కావడం వల్ల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. శనివారం నాడు 84,571 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 36,711 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.70 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు. ఆదివారం నాడు అదే రద్దీ కొనసాగింది. దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టింది.

కాగా- తిరుమలలో ఈ నెల 25వ తేదీన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. ఆ రోజున స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు. అశేష భక్త జనావళిని కటాక్షించనున్నారు. సాయంత్రం 7 నుండి 9 గంటలవరకు శ్రీదేవి, భూదేవిలతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు పెద్ధశేష వాహనారూఢుడై నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
సర్పరాజైన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువుకు నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే లభిస్తోంది.












Click it and Unblock the Notifications