చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్ - నా పై పోటీ చేయండి : డిపాజిట్లు తెచ్చుకోండి...!!
వచ్చే ఎన్నికల పైన సవాళ్లు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా లో నియోజకవర్గాల్లో గెలుపు టీడీపీ - వైసీపీ ముఖ్య నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కుప్పం పైన తాజాగా సీఎం జగన్ అక్కడ గెలవబోతున్నా మంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లో ఎందుకు గెలవలేమని వ్యాఖ్యానించటం పైన టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఈ సారి వైసీపీ సింగిల్ డిజిట్ దాటదని జోస్యం చెప్పారు. ఇక, తంబళ్లపల్లె కు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరిన సమయంలో..చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్ రాకుండా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
దీనికి తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఖబడ్దార్ చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించారు. చంద్రబాబు..లోకేష్ ఎవరైనా తంబళ్లపల్లెలో తన పై పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ చేసారు. ఆ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతు చేస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. తంబళ్లపలిల్లో దొంగలను పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఆయన స్థాయి ఏంటో ప్రజలకు అర్దం అవుతుందని ద్వారకానాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కుప్పం లో చంద్రబాబును ఓడించి తీరుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేసారు.

టీడీపీ టార్గెట్ ఆ రెండు నియోజకవర్గాలు
కాగా, దీనికి ప్రతిగా పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇక, చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో చిత్తూరులో అన్ని సీట్లు గెలవాలంటూ పార్టీ నేతలకు చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేసారు. కానీ, వైసీపీ మాత్రం కుప్పం పైనే ప్రధానంగా జిల్లాలో ఫోకస్ చేస్తోంది. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్ది చంద్రమౌళి మరణంతో ఆయన కుమారుడు భరత్ కు ఎమ్మెల్సీ పదవితో పాటుగా తాజాగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

కుప్పం పైనే వైసీపీ ఫోకస్
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కి ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి కే అక్కడి బాధ్యతలు కేటాయించారు. కుప్పంలో స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తరువాత వైసీపీ మరింత జోష్ తో కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా..ప్రధానంగా చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి సోదరుల సవాళ్లతో... జిల్లాలోని కుప్పం - పుంగనూరు - తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రెండు పార్టీల వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications