ప్రజలు నపుంసకులు -ఏపీలో మగాళ్లు లేరు -రఘుగాడినే వేశామన్నది జగన్ లెక్క: వైసీపీ ఎంపీ అనూహ్యం
సొంత పార్టీపై, పార్టీ అధనేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ప్రజలపైనే తన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కారు. జనాన్ని నపుంసకులంటూ, జగన్ అచారకాలను ప్రశ్నించడానికి ఏపీలో ఒక్క మగాడు కూడా లేడని అనుచిత కామెంట్లు చేశారు. సొంత నియోజకవర్గానికి వెళ్లనీయకుండా జగనే అడ్డుకుంటున్నాడని, ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం అక్రమాలను ఎడగడతానని చెప్పారు. రాజధాని రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఒక అమ్మకు పుట్టినవాళ్లయితే..
''అంతర్జాతీయ దినోత్సవం రోజున కూడా ఆంధ్రప్రదేశ్ లో మహిళల పట్ల దురాగతం కొనసాగింది. అమరావతిలో 445 రోజులుగా ఉద్యమిస్తోన్న మహిళలు.. ప్రభుత్వం సహకరించడం లేదని, మహిళా హోం మంత్రి కూడా పట్టించుకోవడం లేదనే బాధతో కనీసం విజయవాడ కనకదుర్గమ్మకైనా గోడు వినిపించుకుందామని బయలుదేరితే వారి పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించారు. ఉల్లిపాయ బస్తాల్ని లారీల్లోకి విసిరేసినట్లు మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి విసిరేశారు. ఇది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం. అమరావతి మహిళలదే కాదు, యావత్ ఆడవాళ్లు, మగవాళ్ల సమస్య కూడా. ఒక అమ్మకు పుట్టినవాళ్లెవరైనా దీన్ని ఖండించకపోతే చచ్చిన శవాలతో సమానం..

ఏపీలో మగాళ్లు ఉన్నారా?
మహిళలు పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తోన్న జగన్ సర్కారు తీరును కనీసం ప్రజలు ప్రతిఘటించాలి. భయపడుతూ ఎన్నాళ్లు బతుకుతాం. ఎవర్ని చూసి మనం భయపడుతున్నాం? వాడు కూడా ఒక అమ్మకు పుట్టలేదా? ఎందుకు భయం? ధైర్యంగా మీ వాయిస్ సోషల్ మీడియాలో పెట్టండి. ఇవాళ అమరావతి మహిళలకు అంయింది రేపు అందరికీ జరగొచ్చు. ఏపీలో మహిళలపై జరుగుతోన్న దురాగతాను పార్లమెంటులో ప్రస్తావిస్తాను. అమరావతిలో మహిళలపై పోలీసుల దాష్టీకాన్ని లేవనెత్తుతాను. మహిళలు ఎలాగూ ఉద్యమిస్తారు, పురుషులు కూడా ఈ నిరంకుశత్వాన్ని ఖండించాలి. అసలు ఏపీలో మగాళ్లు ఉన్నారా? వాళ్లలో మగతనం ఉందా? అనేదానికి ఇదొక లిట్మస్ టెస్టు.

జనం చెవుల్లో పువ్వులు..
మున్సిపల్ ఎన్నికల వేళ రాయలసీమ జిల్లాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. అయితే, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో మాత్రం అది సాధ్యం కాలేదు. ఎన్నికల అక్రమాలపై, ఫోర్జరీ సంతకాలతో వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న ఘటనలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనదైన శైలిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల కలిసి ఇంత దారుణంగా కుట్రలు చేస్తుంటే, ఇంత అరాచక పాలన సాగుతోంటే.. మళ్లీ ఎన్నికల్లో వైసీపీకి నూకలు చెల్లుతాయని, జనం తిరగబడతారని సీఎం జగన్ కు ఎవరైనా చెప్పాలి. అసలు ఎన్నికలు లేని ప్రజాస్వామ్యం ఏంటి? 75వ స్వాతంత్ర్య దినోత్సవ కమిటీలో జగన్ కు కూడా చోటు కల్పించారు. కానీ ఆయన మాత్రం స్వాతంత్ర్యం అనే పదానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళుతున్నారు. 25 శాతం స్థానాలు ఏకగ్రీవం అయ్యాయంటే జనం చెవుల్లో పువ్వులు పెట్టినట్లు కాదా?

ఆ మూడు మేయర్లు గెలవాలంటే..
రాజధాని విషయంలో జగన్ సర్కారు యూటర్న్ లు, పిల్లిమొగ్గలు వేసింది. విశాఖపట్నంలో స్థానికేతరులను దింపి అరాచకాలకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడి జనం రాజధాని వద్దేవద్దు అంటున్నారు. విజయవాడ, గుంటూరులోనూ రాజధాని అంశం ప్రధానంగా ఉంది. ఈ మూడు చోట్లా.. వైసీపీ నేతలు చెబుతున్నట్లు 80 శాతం మెజార్టీతో మేయర్ పదవుల్ని గెలుచుకోవాలంటే పార్టీ తనకు అలవాటైన అబద్ధాలను మరోసారి ప్రచారం చేయాలి. రాజధానిని విశాఖలో పెట్టడం లేదని ఒక అబద్దపు ప్రకటన చేస్తే, మూడు చోట్లా వైసీపీ ఘన విజయం సాధిస్తుంది. అంతటి ధర్మరాజే యుద్ధంలో అబద్ధం ఆడాడు. ఇప్పుడు వైసీపీ 80 శాతం మెజార్టీతో గెలవాలి కాబట్టి జగన్ కూడా అదే పని చేయాలి.

జగన్ అకృత్యాలు దేశమంతా తెలిసేలా..
ముఖ్యమంత్రి జగన్ రెండేళ్లుగా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ప్రజా సమస్యలను వినడం లేదు. కనీసం ప్రజల్లోకి వెళదామనుకుంటే నన్ను కూడా అడ్డుకుంటున్నారు. సొంత నియోజకవర్గానికి వెళ్లనీయకుండా నాపై అక్రమ కేసులు పెట్టారు. ఇటు చూస్తే మహిళలపై దారుణ సంఘటనలు. వీటన్నింటిపైనా నేను జాతీయ స్థాయిలో మాట్లాడుతాను. జగన్ అకృత్యాలు దేశమంతటికీ తెలిసేలా.. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు అందరికీ మెయిల్స్ పెట్టాను. కేంద్ర మంత్రులకు కూడా లేఖలు పంపాను. కరోనా తర్వాత నాకు గుండె ఆపరేష్ అయింది, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకున్నా జనంలోకి వెళదామనుకుంటే.. జగన్ తన బాబాయికి ఫోన్లు చేసి నన్ను ఆపాలని ఆదేశాలిచ్చారు..

రఘు గాడిని వేసేశాం.. మీరెంత..
నా నియోజకవర్గ పర్యటనపై జగన్ నుంచి ఫోన్ రాగానే వాళ్ల బాబాయి సుబ్బారెడ్డి.. జిల్లాలోని మంత్రికి కబురు పెట్టారు. ఆ మంత్రి ఆదేశాలతో పోలీసులు నాపై పాత తేదీల్లో కేసులు కట్టారు. నన్ను ఒక్క రోజైనా లాకప్ లో పెట్టి హించాలన్నదే వారి లక్ష్యం. ఆ తర్వాత రఘుగాడిని వేసేశాం.. మీరెంత? అని మిగతా వాళ్లకు మెసేజ్ పంపాలన్నదే జగన్ లెక్క. ఇంతగా మావాళ్లు నాపై కక్ష కట్టడానికి నేను చేసిన తప్పేంటి? రాజ్యాంగ గురించి మాట్లాడటమేనా? క్రిస్టియన్ మతంలో చేరితో దళితులకు ఎస్సీ రిజర్వేషన్ రద్దవుతుందని రాజ్యాంగంలోనే ఉంది. ఏపీలో ఊరికి 10 చర్చలు ఉన్నా, అధికారికంగా జనాభా పరంగా క్రైస్తవులు 2 శాతమే. అదే చంద్రన్న క్రిస్మస్ గిఫ్టుల కోసం ఏకంగా 38 లక్షల కుటుంబాలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాయి. వాళ్లందరినీ ఎస్సీలుగా కొనసాగించొద్దని, ఏపీలో చేపట్టే జనాభా లెక్కల్లో మత గణనను కూడా చేయాలని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలిశాను. జగన్ కూడా చర్చికి వెళతారు కాబట్టి నాపై కక్ష పెంచుకుని ఉండొచ్చు. అయితే..

150 ఏళ్ల కిందటే చెప్పేశాడు..
రాజ్యాంగ అంశాలను ప్రస్తావిస్తే నా హక్కులను కాలరాస్తారా? సీఎం స్వయంగా చట్టాలను గౌరవించకుండా, నాపై అక్రమ కేసులు పెట్టడమేంటి? ఎంపీనైన నాకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇదేనా రాజన్న రాజ్యం? నాపై ఉన్నవన్నీ ఫాల్తూ కేసులే. దీనంతటికీ సృష్టికర్త, తాండవకర్త, లయకర్త సీఎం జగనే. అరాచకం ఇలానే కొనసాగితే, జగన్ పై కేసుల్లో సాక్ష్యుల పరిస్థితి ఏంటి? కాబట్టే దీనిపై పార్లమెంటులో పోరాడుతా. జీరో అవర్ లో మాట్లాడుతానని లాటరీ వేశాను. అది రాకుంటే, స్పీకర్ ను ప్రత్యేక అనుమతి కోరతాను. రాబర్ట్ క్లిక్ అనే సామాజిక వేత్త 150 ఏళ్ల కిందట చెప్పినట్లు.. ఎసమాజంలోనైతే నీతి తప్పిన వారు విజయంసాధిస్తారో, నేరస్తులు ఆరాద్యులుగా మారతారో, విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో.. అవినీతి సర్వత్రా తాండిస్తున్నా పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాటా కోసం ప్రజలు ఆర్రులు చాస్తారో అక్కడ వ్యవస్థ పున:సమీక్షకు సమయం ఆసన్నమైందనే విషయం ఇవాళ ఏపీలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. నిజానికి..

ప్రజలు నపుంసకులు.. బయటికి రారు..
ఏపీలో పనికిమాలిన ప్రజలు ఉంటారని, అక్కా చెల్లెళ్లపై దాడులు జరిగినా నోరు విప్పలేని పురుషులు ఉంటారని రాబర్డ్ లాంటి మేధావులు ఆనాడే ఊహించారు. నిజం చెప్పాలంటే ప్రజల మెమరీ షార్ట్. మేం ఎన్ని అబద్ధాలు చెప్పినా భరిస్తున్నారుగా. అమరావతిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నాడని ఎన్నికల్లో చెప్పి, ఇప్పుడు రాజధానిని ఎత్తేశాం. ఏదో కొందరు మాత్రమే పోరాడుతున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రజలంతా గొర్రెలే కదా? ఓవర్ నైట్ యాటిట్యూట్ మారుతుందా? చాలా మంది ప్రజలు నపుంసకులు. ఇళ్లలో నుంచి బయటికి రారు. వాళ్ల తరఫున నిమ్మగడ్డో, ఇంకెవరో పంచె కట్టుకుని రోడ్డు మీదకు కత్తిపట్టుకుని వెళ్లాలి తప్ప జనమైతే బయటికి రారు. జగన్ వేసే గింజలు తింటున్నాం. ఆ గింజల్ని ఇప్పుడు ఇంటికొచ్చి పంచుతున్నారు. రేప్పొద్దున కలిపి పెట్టమన్నా.. ఐదువేలకే పనిచేసే వాలంటీర్లు, రూపాయికే పనిచేసే సీఎం ఉన్నారు కాబట్టి అదీ చేస్తారు..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications