వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు? సాయంత్రం ప్రెస్మీట్! ప్రశాంత్ కిశోర్ కూడా?
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం 120 స్థానాల్లో జయకేతనాన్ని ఎగుర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రభావం నామమాత్రంగా కూడా లేదు. ఈ అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావచ్చని ఓట్ల లెక్కింపును బట్టి అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన 102 సీట్ల కంటే అధిక స్థానాలను వైఎస్ఆర్ సీపీ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమైంది. 130 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని మెజారిటీని సాధిస్తోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలోకి రాగలిగే స్థానాలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
ఈ పరిస్థితుల్లో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఒంటి చేత్తో పార్టీని విజయ తీరాలకు చేర్చబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందన ఏమిటనే విషయాన్ని ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆసక్తిగా ఉన్నారు. గురువారం సాయంత్రం వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
అందుబాటులో ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి వైఎస్ జగన్ సమావేశం అవుతారని, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సిద్ధాంత కర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.