గోరంట్ల మాధవ్ వీడియో: మూలకారకుడైన చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు
అమరావతి: రోజులు గడుస్తోన్నప్పటికీ- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారంపై చెలరేగిన రాజకీయ దుమారం తగ్గట్లేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి రోజూ స్పందిస్తూనే వస్తోన్నారు. ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతూనే ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేంత వరకూ వదిలేది లేదంటూ టీడీపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. ఈ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ అనంతపురం జిల్లా పోలీసులు ప్రకటించినప్పటికీ.. టీడీపీ నాయకులు మాత్రం పట్టించుకోవట్లేదు.

బలహీనపర్చాలనే..
ఇప్పుడు తాజాగా సీఐడీ అధికారులు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని ఎంతగా జనంలోకి తీసుకెళ్లగలిగితే అంతగా రాజకీయంగా లబ్ది పొందగలమనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో బలంగా ఉంది. రాజకీయంగా గోరంట్ల మాధవ్ను బలహీనపర్చడం ద్వారా.. హిందూపురం లోక్సభ పరిధిలో పట్టును పెంచుకోవచ్చని భావిస్తోన్నారు.

అశ్లీల వీడియోలపై
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అనుసరిస్తోన్న వైఖరి పట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్నూ ఆయన ఏకిపారేశారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అశ్లీల వీడియోను సృష్టించి తప్పుడు ప్రచారానికి టీడీపీ దిగిందని మండిపడ్డారు. ఫేక్ వీడియోను సృష్టించి దుష్ప్రచారం చేస్తోన్నారని ధ్వజమెత్తారు.

సిగ్గు ఇవ్వలేదు..
అశ్లీలాన్ని కూడా తన రాజకీయం కోసం వాడుకునేంత దుస్థితికి చంద్రబాబు చేరుకున్నారని విమర్శించారు. రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇంతగా బరితెగించాల్సిన అవసరం ఉందా అని నిలదీశారు. దేవుడు చంద్రబాబుకి సిగ్గు అనేది ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అసలు పోతిన ప్రసాద్ ఎవరు?, ఆయనకు ఈ వ్యవహారానికి ఏం సంబంధం ఏమిటనీ ప్రశ్నించారు. పోతిన ప్రసాద్కు తాము ఇచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని ఎక్లిప్స్ ల్యాబ్ స్పష్టం చేసిందని పేర్ని నాని చెప్పారు.

నిత్యం అసత్యాలే..
ఒక అశ్లీల వీడియో సృష్టించడం, దాన్ని ప్రచారం చేయడం ఎందుకు.. తానే దీన్ని తయారుచేశానని చంద్రబాబు స్వయంగా ప్రకటించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారనే విషయం మరోసారి ఈ వ్యవహారంలో రుజువైందని చెప్పారు. నిత్యం అసత్యాల ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియోతో కలిసి అసత్య ప్రచారాలను సాగిస్తోన్నారని, అది నిజమని నమ్మించడానికి నానా తంటాలు పడుతున్నారని చురకలు అంటించారు.

అమెరికా ల్యాబ్ పేరుతో కూడా ఫేక్..
వ్యవస్థలను తన అవసరాలకు వాడుకునే అలవాటు ఉన్న చంద్రబాబుకు అశ్లీలం ఒక లెక్క కాదని పేర్ని నాని అన్నారు. అమెరికా సంస్థ ఇచ్చిందంటూ ఓ ఫేక్ సర్టిఫికేట్తో దుష్ప్రచారం చేస్తున్నారని, తాము ఇచ్చిన రిపోర్ట్ను పోతిన ప్రసాద్ ట్యాంపర్ చేశాడని జిమ్ స్టాఫర్డ్ స్పష్టం చేశారని పేర్ని నాని తెలిపారు. ఫేక్ వీడియోను చంద్రబాబు, నారా లోకేష్ సృష్టించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆ ఫేక్ వీడియో ఐటీడీపీ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయిందని గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ ఎంటర్టైనర్..
ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేసిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్ని నాని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫేక్ వీడియోలు, ట్యాంపర్ చేసిన నివేదికలతో చేస్తోన్న ఈ తప్పుడు ప్రచారం ఫిర్యాదు చేస్తామని, దీనికంతటికీ మూలకారకుడైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీనులను కోరారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వల్ల రాజకీయాల్లో ఓ మంచి ఎంటర్టైనర్ దొరికాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రోజుకో మాట మాట్లాడుతూ గందరగోళంలో పడుతుంటాడని చెప్పారు. పవన్ కల్యాణ్ నిర్వహించే సభలు, సమావేశాలు రాష్ట్ర ప్రజలకు మంచి ఎంటర్టైన్ చేస్తుంటాయని, ఆయనకు టీడీపీ నుంచి ప్యాకేజీలు అందుతుంటాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications