పిడమర్తి రవికి పోస్ట్! త్వరలో విద్యార్థులకు కేసీఆర్ ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల తరఫున ముందుండి పోరు సాగించిన ఉద్యమ నేత పిడమర్తి రవిని కేసీఆర్ సర్కారు అందలమెక్కించింది. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్కు ఆయనను తొలి ఛైర్మన్గా నియమిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ లభించినప్పటికీ పిడమర్తి రవి విజయం సాధించలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన పిడమర్తి రవి ఉద్యమంలో ఓయూ జాక్ కన్వీనర్గా కీలక భూమిక పోషించారు. సీఎంగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నామినేటెడ్ పదవుల పందేరాన్ని పిడమర్తితోనే ప్రారంభించడం గమనార్హం.
ఉద్యమకారులకు ఉద్యోగాల్లో కోటా
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాల్లో కోటా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యమం సమయంలో పాల్గొన్న పలువురు విద్యార్థుల పైన అప్పట్లో కేసులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యోగాల్లో 10 శాతం కోటా ఇవ్వాలనే యోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఉద్యోగ కోటా పొందేందుకు అర్హమైన విద్యార్థులను గుర్తించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పైన ఉన్న కేసులను పరిశీలించనున్నారని తెలుస్తోంది.
ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాల్లో కోటా విషయమై కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైన ఇప్పటికే తెరాస ప్రభుత్వం పైన విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోటా ద్వారా వారిని సంతృష్టుల్ని చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కోటా ఇవ్వండి: కేటీఆర్ను కోరిన జేఏసీ
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా విద్యార్థులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని జేఏసి నాయకులు అంతకుముందు కోరారు. వారు మంగళవారం సచివాలయంలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఉద్యమంలో కీలక భూమికి పోషించిన వారిని గుర్తించి సహకరించాలని కోరారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న వారికి ఆ రాష్ట్రం ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, తెలంగాణలో సైతం అలా చేయాలని కోరారు.