సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్నా-కనగరాజ్ కు మరోసారి ఇలా : నాడు ఎస్ఈసీ-నేడు పీసీఏ..!!
రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.కనకరాజ్ కు ఏపీ ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా న్యాయ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణ-కరోనా కారణంగా వాయిదా వేయటంతో ప్రభుత్వంతో వివాదం ఏర్పడింది. ఆ సమయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేస్తూ ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా కరోనా వేళ..అన్ని నిలిచిపోయినా ప్రత్యేకంగా జస్టిస్ కనగరాజ్ అమరావతి చేరుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు.

గతంలో నిమ్మగడ్డ స్థానంలో నియమించినా..
దీని పైన నిమ్మగడ్డ రమేష్ కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. నిమ్మగడ్డ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించేలా ఆదేశాలిచ్చింది. దీంతో..కనగరాజ్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో కనగరాజ్ కు మరో కీలక పదవి ఇచ్చేలా జగన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. సుప్రీం ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు చేసింది.

ఇప్పుడు పీసీఏ ఛైర్మన్ గా నియామకంలోనూ..
దీంతో..ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ గా రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.కనకరాజ్ ను నియమించారు. ఆయనతో పాటుగా ఇద్దరు సభ్యులను కేటాయించారు. జిల్లా స్థాయిల్లోనూ ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ గా రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.కనకరాజ్ నియామకాన్ని సవాలు చేస్తూ న్యాయవాది పారా కిషోర్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసారు.

కనగరాజ్ నియామకం విరుద్దమంటూ..
జస్టిస్ కనకరాజ్ నియామకం సుప్రీమ్ కోర్టు తీర్పుకు విరుద్ధమని,గతములో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా చేసిన నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడముతో దురుద్దేశ పూర్వకంగా ఈ నియామకాన్ని చేపట్టారని తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యములో పిటిషనర్ తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు తన వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు గురువారం బెంచ్ మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ స్టేట్ లెవల్ పోలీసు అథారిటీ నిబందనల ప్రకారం 65 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారే ఈ ఛైర్మన్ పోస్టుకు అర్హులుగా పిటీషన్ లో వివరించారు.
Recommended Video

నిబందనలు మినహాయింపు ఇచ్చారని..
అయితే, ప్రభుత్వం కేవలం జస్టిస్ కనగరాజ్ కోసం ఈ నిబంధన మినహాయింపు ఇస్తూ ఆయనను నియమించిందని కోర్టుకు నివేదించారు. పోలీసు అధికారులు-సిబ్బంది పైన ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈ అధారిటీని ఏర్పాటు చేసారు. అయితే, 65 ఏళ్ల కంటే పై బడిన కనగరాజ్ ను ప్రభుత్వ కీలక పోస్టు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం చేపట్టిందంటూ పిటీషనర్లు వాదిస్తున్నారు. ఇప్పుడు కనగరాజ్ నియామకం పైన కోర్టులో పిటీషన్ దాఖలు కావటంతో ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications