సర్వేలు చూసి చతికిల, జగన్ వస్తే ఊహించండి: బాబు
హైదరాబాద్: ఇటీవలి సర్వేలను చూసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చతికిల పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మరికొందరు చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు.
సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తి తమకే ఉందని అందరూ భావిస్తున్నారని, అందుకే అనేక మంది సైకిల్ ఎక్కుతున్నారన్నారు. వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి తిరుగులేని మెజార్టీ వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, నిరుద్యోగం, ధరలు బాగా పెరిగాయన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారన్నారు. కూరగాయలు కొనేటప్పుడే మనం పుచ్చువా లేదా మంచివా అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామని, అలాంటిది ఐదేళ్లు పాలించే వారి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలన్నారు.
రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసే సత్తా టిడిపికే ఉందన్నారు. జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే కంపెనీలు పారిపోతాయన్నారు. ఇచ్చిన లంచం చాలలేదని వాటాలు అడిగి బెదిరింపులకు దిగే వాళ్లు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఊహించండని జగన్ను ఉద్దేశించి అన్నారు.
ప్రజల కోరిక మేరకే తాను టిడిపిలో చేరుతున్నానని పితాని సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు పార్టీ మోసం చేసినందువల్లే తాను ఆ పార్టీని వీడానన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీతో ఒరిగేదేమీ లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబుకే ఉందన్నారు.