నన్ను రక్షించండి మహాప్రభో: జగన్
2019లో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత మనోబలం ఇప్పుడు లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలో అంతా తానే అయి ఏకచత్రాధిపత్యంగా పరిపాలన సాగిస్తున్న జగన్ మూడు సంవత్సరాల సమయం గడిచేసరికి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేక బేలతనానికి గురవుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చ నడుస్తోంది.
పార్టీపై, ప్రభుత్వంపై పూర్తిస్థాయి పట్టు సాధించిన జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణకు వచ్చేసరికి జావకారిపోయారని సీనియర్ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉన్న మంత్రులందరినీ తొలగించి కొత్తవారిని తీసుకోవాలనుకున్నప్పటికీ పదిమంది మంత్రుల వరకు పాతవారినే కొనసాగించారు. సీనియర్ నేతలుగా ఉన్న మంత్రులు తమ పదవులు కోల్పోయి ప్రభుత్వంలో కాకుండా బయట ఉంటే ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరుగుతుందంటూ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు జగన్ పాతవారిని కొనసాగించారు. ఒకరకంగా వీరంతా మంత్రి పదవి కోల్పోయి మాజీ మంత్రులుగా ఉంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేయరని జగన్ భావించడంతో వారిని కొనసాగించకతప్పలేదు.

తాజాగా గురువారం దుష్టచుతుష్టయం నుంచి కాపాడాలంటూ శ్రీ వెంకటేశ్వరస్వామివారిని వేడుకున్నానంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభలో ప్రకటించారు. ఆయన దృష్టిలో దుష్టచతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5, చంద్రబాబునాయుడు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత పార్టీ వ్యక్తులకు, మీడియాకు, ప్రతిపక్షానికి .. ఇలా అందరికీ భయపడితే పార్టీపై, ప్రభుత్వంపై పట్టు జారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. రోజులు గడిచేకొద్దీ కొన్ని కొన్ని విషయాల్లో బేలతనానికి గురవుతున్నారని, దీన్ని అధిగమించి పార్టీలోను, ప్రభుత్వంలోను లోపాలు ఎక్కడున్నాయో సరిదిద్ధుకోవడంతోపాటు ప్రజారంజకమైన పరిపాలన అందిస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications