కేంద్ర కేబినెట్ లోకి ఏపీ నుంచి ఆయనకే ఛాన్స్, మోదీ మార్క్ లెక్కలు..!?
ఏపీ కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీ కరణకు కసరత్తు జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కనుంది. కూటమి నుంచి ఈ సారి ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఏపీ బీజేపీ ఎంపీకి కేబినెట్ లో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయి. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్ లో కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు సహా పలువురి శాఖలు మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది.
ప్రధాని మోదీ 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ నెల 20 వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చునని తెలుస్తోంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం.

గత రెండేళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అంతేకాక ఈసారి యువ నేతలకు, మహిళలకు ప్రాధాన్యమివ్వనున్నారని అంటున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో.. కొత్తగా కేంద్రం మంత్రి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు.
ఏపీలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు
కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందు కు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ కు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కుతుందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఏపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే, జనసేన -టీడీపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చినా.. బీజేపీ మరో మంత్రి పదవి ఏపీకి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉండగా పురందేశ్వరి రాజమండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి శ్రీనివాస వర్మ ఉండటంతో... ఉమ్మడి విశాఖకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్ సమీకరణాలు.. ఏపీ కేంద్రం రాజకీయ వ్యూహాల అమల్లో భాగంగా బీజేపీ ఈ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే విధంగా టీడీపీ- జనసేన కు అవకాశం పైనా చర్చ సాగుతోంది. జనసేనకు ఈ సారి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో... కేంద్ర కేబినెట్ లో ఫైనల్ గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది.













Click it and Unblock the Notifications