మోడీ భీమవరం పర్యటన-ఒక్క టూర్ -వంద ప్రశ్నలకు జవాబు ? నెగ్గిన జగన్ పంతం !
ఏపీలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటించబోతున్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు భీమవరం వస్తున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ టూర్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీ రాజకీయపార్టీలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనకు ఆయన కీలక సంకేతాలు పంపుతున్నారు. దీన్ని బట్టి భవిష్యత్తు రాజకీయాలపై ఇప్పుడే ఓ అంచనాకు వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు.
Recommended Video


మోడీ భీమవరం టూర్
ప్రధాని మోడీ ఇవాళ భీమవరం టూర్ కు వస్తుండటంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు విప్లవవీరుడు అల్లూరి జయంతోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాల్సిన వారికి ఆహ్వానాలు పంపింది. అలాగే మిగతా వారిని మాత్రం దూరంగానే ఉంచేసింది. ముఖ్యంగా తన సొంత నియోజకవరంగలో జరుగుతున్న ఈ టూర్ కు హజరయ్యేందుకు స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రయత్నాలూ నెరవేరలేదు. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ తో పాటు ప్రధాని మోడీ, చిరంజీవి మాత్రమే వేదికపై ఆసీనులవుతున్నారు.

జగన్ కు భారీ ఊరట
ప్రధాని మోడీ టూర్ లో పాల్గొనేందుకు పారిస్ నుంచి ఆఘమేఘాల మీద తిరిగొచ్చిన సీఎం వైఎస్ జగన్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇన్నాళ్లూ బీజేపీతో ఆయన కొనసాగిస్తున్న సంబంధాలు, అందిస్తున్న సహకారాన్ని, స్ధానికంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేత అన్న అంశాల్ని దృష్టిలో ఉంచుకుని జగన్ కోరుకున్న వారినే ఈ టూర్ కు వచ్చేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. అలా అనే కన్నా వారిని దూరంగా ఉంచేసిందని చెప్పవచ్చు. ఇందులో చంద్రబాబు, పవన్, రఘురామకృష్ణంరాజు ఉన్నారు.

చంద్రబాబుకు అవమానమిలా
టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత అయిన చంద్రబాబును ఈ టూర్ కోసం ప్రత్యేకంగా కేంద్రం ఆహ్వనించలేదు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పంపిన లేఖలో టీడీపీ నుంచి ఓ ప్రజా ప్రతినిధిని పంపమని మాత్రమే కోరారు. అంతే కాదు ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటారని భావించారో ఏమో స్వయంగా కిషన్ రెడ్డి మళ్లీ చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ క్లారిటీ ఇచ్చేశారు.దీంతో చంద్రబాబు చేసేది లేక టీడీపీ తరఫున రాష్టపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని భీమవరం పంపుతున్నారు. దీంతో బీజేపీతో స్నేహం కోసం ప్రధాని టూర్ కు వెళ్లితీరాలన్న చంద్రబాబు ఆశలు నెరవేరలేదు.

మిత్రుడు పవన్ కూ అదే అవమానం
చంద్రబాబును భీమవరం టూర్ కు ప్రధాని మోడీ ఆహ్వానించలేదంటూ సరే ఆయన విపక్ష నేత, ఒకప్పుడు తమపై పోరాటాలు చేసి రాజకీయంగా దూరమైన నేత అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలో తమ మిత్రపక్షం జనసేనకు అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ను సైతం ప్రధాని మోడీ తన టూర్ కు ఆహ్వానించలేదని తెలుస్తోంది. చంద్రబాబు తరహాలోనే పవన్ కళ్యాణ్ ను కూడా తమ పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని మాత్రమే కోరినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ కూడా యథావిథిగా తన టూర్లలో బిజీగా ఉన్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా బీజేపీతో జనసేన సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.

రఘురామకూ నో ఎంట్రీ
వాస్తవానికి చంద్రబాబునూ, పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోడీ భీమవరం టూర్ కు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా అది కేవలం రాజకీయ కారణంగా మాత్రమే చెప్పుకోవచ్చు. కానీ స్ధానిక ప్రజాప్రతినిధి, ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజును కూడా ప్రధాని మోడీ టూర్ కు దూరంగా ఉంచారు. ఆయనకు ప్రధాని మోడీ టూర్ లో పాల్గొనేందుకు అరెస్టు కాకుండా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా జగన్ సూచనతో ప్రధాని మోడీ ఆయన్ను కట్టడి చేయించినట్లు అర్ధమవుతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు తన టూర్ ను రద్దు చేసుకుని హైదరాబాద్ వెనుదిరిగారు.

పంతం నెగ్గించుకున్న జగన్ ?
ప్రధాని మోడీ భీమవరం టూర్ లో తనతో పాటు, ఇప్పటికే తనతో సత్సంబంధాలు నడుపుతున్న సినీనటుడు చిరంజీవిని మాత్రమే హాజరయ్యేలా చేయడంలో సీఎం జగన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ కోరిక మేరకే విపక్ష నేతల్ని కాకుండా వారి పార్టీల నుంచి ప్రతినిధుల్ని మాత్రమే ఆహ్వానించినట్లు అర్దమవుతోంది. అలాగే జగన్ కు పంటికింద రాయిలా మారిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును కుడా ఆయన పెట్టుకున్న అదనపు భద్రత వినతిని పట్టించుకోకుండా పక్కనబెట్టేయడం వెనుక వైసీపీ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ స్వరాష్ట్రంలో జరుగుతున్న ప్రధాని మోడీ టూర్ లో ఎవరెవరుండాలనే దాన్ని నిర్దేశించే స్ధాయికి ఎదగడం మామూలు విషయం మాత్రం కాదనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications