సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : ధరలు ఎక్కువే - ప్రత్యేకతలు ఇలా..!!
Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సెమీ హైస్పీడ్ వందేభారత్ నేడు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు. ప్రారంభం రోజున ఈ రైలులో సాధారణ ప్రయాణీకులకు అవకాశం లేదు. 13 స్టేషన్లలో తొలి రోజు రైలు ఆగనుంది. 10వ తేదీ నుంచి రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి రూట్, షెడ్యూల్, టికెట్ ధరలు ప్రకటించారు. ఇతర రైళ్ల కంటే వందేభారత్ లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రత్యేకతలు గుర్తించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.

8 కోచ్ లు.. 8.30 గంటల్లోనే: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ను కొంత కాలంగా 8 కోచ్ లతోనే నడపాలని నిర్ణయించారు. ఇందులో ఏడు ఏసీ ఛైర్ కార్ కోచ్ లు కాగా, ఒకటి ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్. 530 మంది ప్రమాణీకులకు సరిపడా సీట్లు ఉంటాయి. ప్రయాణీకుల డిమాండ్..ఆదరణ పరిగణలోకి తీసుకొని అవసరం మేర కోచ్ లు పెంచాలని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు సికింద్రాబాద్ - తిరుపతి ప్రయాణం దాదాపు 12 గంటలుగా ఉంది. వందేభారత్ ద్వారా మొత్తం 660కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ ఉండనున్నాయి. వారంలో మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది.
టికెట్ ధరలు ఎక్కువే: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే వందేభారత్ టికెట్ ధరలు ఎక్కువే. వెంకటాద్రిలో ఫస్ట్ ఏసీ రూ 2,390, సెకండ్ ఏసీ రూ 1,430, థర్డ్ ఏసీ రూ 1,020గా ఉన్నాయి. ఇదే సమయంలో వందేభారత్ లో ఛైర్కార్ ఛార్జీలు చూస్తే..ఛైర్కార్ టికెట్ ధర రూ.1680. కేటరింగ్ ఛార్జీలు రూ 364గా నిర్ణయించారు. వద్దనుకుంటే ఆ ఛార్జీ మినహాయిస్తారు.
ఇదే సమయంలో సికింద్రాబాద్ టూ నల్గొండ - రూ.470 ,సికింద్రాబాద్ టూ గుంటూరు - రూ.865, సికింద్రాబాద్ టూ ఒంగోలు - రూ.1075 , సికింద్రాబాద్ టూ నెల్లూరు - రూ.1270 గా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ టికెట్ ధరను రూ.3030 గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధరలు..సికింద్రాబాద్ టూ నల్గొండ - రూ.900 , సికింద్రాబాద్ టూ గుంటూరు - రూ.1620 , సికింద్రాబాద్ టూ ఒంగోలు - రూ.2045 , సికింద్రాబాద్ టూ నెల్లూరు - రూ.2455.
వందేభారత్ ప్రత్యేకతలు: వందేభారత్ లో ప్రతీ కోచ్ లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ప్లే అవుతాయి. లోపల బయట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ట్రైన్ లోపల వైఫై సౌకర్యంతో పాటు ప్రతి కోచ్లో 4 ఎమర్జన్సీ లైట్లు అమర్చారు. ఇక ప్రమాదాల నివారణపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది రైల్వేశాఖ.
అందులో భాగంగానే ఎదురుగా రైలొస్తే ఢీ కొట్టకుండా కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు. 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు ఈ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ కు వచ్చిన ఆదరణ తరహాలోనే ఈ రైలుకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications