మూడు రాజధానులపై ప్రధాని లేఖ: టీడీపీ వాదనలపై స్పందన: మోడీ ఏం తేల్చారు..!
ఏపీలో తెగని పంచాయితీగా మారిన మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రధాని మోడీ స్పందించారు. అసలు కేంద్రానికి చెప్పిన తరువాతనే ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా..లేక సమాచారం ఇవ్వకుండానే డిసైడ్ అయ్యారా అనే దాని పైన చర్చ సాగింది. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు సైతం దీని పైన భిన్నంగా స్పందించారు.
ఇక, ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ అమరావతి వ్యవహారంలో జరుగుతున్న నిర్ణయాల గురించి ప్రధానికి లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానులుగా వర్గీకరించి, మూడు ప్రాంతాల్లో నెలకొల్పాలని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కనకమేడల ప్రధానికి రాసిన లేఖలో వెల్లడించారు. దీని పైన ప్రధాని మోడీ టీడీపీ ఎంపీకీ రిప్లై ఇచ్చారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చినట్లు మోడీ తెలిపారు.
ప్రధానికి టీడీపీ ఎంపీ లేఖ..
ప్రధాని మోడీకి టీడీపీ ఎంపీ కనకమేడల లేఖ రాశారు. ఏపీ మూడు రాజధానుల అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. లేఖను చూసిన మోడీ.. కనకమేడలకు రిప్లై ఇచ్చారు. కడకమేడల రాసిన లేఖలో 13 జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను, వారు చేస్తున్న ఆందోళనలను కూడా బేఖాతరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆందోళనకారులపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తూ, దాడులకు పాల్పడుతూ, మహిళలని కూడా చూడకుండా అక్రమ కేసులు బనాయిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న వైనాన్ని ప్రధానికి వివరించారు.
ప్రశ్నిస్తే రద్దు చేస్తారా..?
చట్టం ప్రకారం ఒకసారి రాజధాని నిర్ణయం జరిగి.. సాక్షాత్తూ ప్రధానమంత్రే శంకుస్థాపన చేసినప్పటికీ.. జగన్ తన స్వార్ణ ప్రయోజనాల కోసం అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడానికి యత్నించడం, సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించడం.. వాటిని శాసనమండలి వ్యతిరేకించడంతో దానిని కూడా రద్దుచేయాలని అసెంబ్లీలో తీర్మానించడం తదితర పరిణామాలన్నీ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
మోడీ నుండి రిప్లైలో ఏముంది...
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాసిన లేఖ తనకు అందిందని ప్రధాని మోడీ ఆయనకు తెలియజేశారు. ఈ మేరకు 12వ తేదీన తిరుగులేఖ రాశారు. దానిపై మోడీయే స్వయంగా సంతకం చేశారు. అందులో భాగంగా..మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చినట్లు మోడీ తెలిపారు. అయితే, తాము ఆ లేఖ పైన ఏ రకంగా స్పందించేదీ మాత్రం అందులో ప్రస్తావించలేదు.
Recommended Video
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదు
ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో సమావేశమైన సమయంలోనే ఈ అంశాన్ని వివరించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ మాత్రం రాజధాని మార్పు అనేది రాష్ట్ర వ్యవహారమని..కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. తాను కేంద్ర పెద్దలతో మాట్లాడినత తరువాతనే స్పష్టం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ ఎంపీ లేఖకు మోడీ రిప్లై ఇచ్చినా..అందులో లేఖలోని అంశాలను పరిశీలిస్తామని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.