మంత్రి స్వగ్రామంలో పేకాట డెన్ ..మంత్రి అనుచరులమని పోలీసులపై దాడి.. సంబంధం లేదన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం గుమ్మనూరు పేరు ఇప్పుడు రాష్ట్రంలో మార్మోగుతోంది. గుమ్మనూరు కేంద్రంగా భారీ ఎత్తున ఒక పేకాట డెన్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు మఫ్టీలో పేకాటరాయుళ్లను పట్టుకోడానికి వెళ్ళారు .దీంతో అక్కడ పేకాట రాయుళ్లు మేము మంత్రి జయరాం అనుచరులమంటూ పోలీసులను చితకబాదారు . వీరంగం వేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. పేకాట రాయుళ్లు మంత్రి పేరు వాడడం చర్చనీయాంశమైంది.

మంత్రి జయరాం స్వగ్రామం గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట డెన్
కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న గుమ్మనూరు జయరాం స్వగ్రామం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు. ఇక్కడ ఒక పేకాట డెన్ పెద్ద ఎత్తున నడుస్తోంది. గుమ్మనూరు లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందం నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అక్కడ వాతావరణం ఎంత పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు నడుస్తున్నాయన్న దానికి అద్దం పడుతుంది. పెద్ద ఎత్తున టెంట్లు వేసి, శానిటైజర్ లను ఉపయోగిస్తూ, చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ను చల్లి మరీ పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నారు.

మఫ్టీలో వెళ్ళిన పోలీసులపై దాడి .. మంత్రి అనుచరులమని వీరంగం
పేకాట స్థావరం వద్ద 35 కార్లు, పెద్ద ఎత్తున టూ వీలర్స్ ఉన్నాయంటే ఎంతమంది ఇక్కడ పేకాట ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు . వీరిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన పేకాటరాయుళ్లు తాము మంత్రి జయరాం అనుచరులమని , మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ? అంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్సై సమీర్ భాషాకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది పేకాట రాయుళ్లు పరారయ్యారు.

పేకాట ఆడుతున్న 32 మంది అరెస్ట్ ... పరారీలో ముగ్గురు
అక్కడ 5,34,000రూపాయలను ,35 కార్లు ,ఆరు స్కూటర్లు సీజ్ చేశామని, అలాగే పేకాట ఆడిన వారిని 35 మందిని గుర్తించామని, పోలీసులపై దాడి చేసిన వారిలో కొందరు డ్రైవర్లను పట్టుకున్నామని ఎస్ఈబీ అదనపు ఎస్పీ గౌతమి శాలీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
టెంట్లు వేసి మరీ పేకాట ఆడడం ,పట్టుకోడానికి వెళ్లిన పోలీసులపైనే దాడి చేయడం, మంత్రి అనుచరులమని చెప్పి మంత్రి జయరాం పేరు వాడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Recommended Video

తనకేం సంబంధం లేదంటున్న మంత్రి జయరాం
మంత్రి స్వగ్రామంలో ఇంతా జరుగుతుంటే మంత్రి తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరించడం ఆసక్తికర అంశం. మంత్రికి సంబంధించిన బంధువులే ఈ పేకాట డెన్ నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. పేకాట వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పేర్కొన్నారు . ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ పేకాట దందా విషయంపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి జయరాం పోలీసులకు తెలిపారు.












Click it and Unblock the Notifications