Polavaram: రేపు ఎడమ కాలువ నుంచి నీటి విడుదల, ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు
ఉత్తరాంధ్ర ప్రజా సమూహాల దశాబ్దాల కల నెరవేరే సువర్ణ ఘడియలు ఆసన్నమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు మార్గం సుగమమైంది. రేపు పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ ఆన్ చేసి, పుడమి తల్లిని తడిపే గోదావరి తరంగాలకు 'జల హారతి' ఇచ్చి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందిన ఈ కాలువ ద్వారా ఉగ్రరూప మెత్తే గోదావరి ప్రవాహం ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి దాహాన్ని తీర్చబోతోంది.
తూర్పు కనుమల విసిరిన క్లిష్టమైన భౌగోళిక సవాళ్లను దాటుకుంటూ, రూ.4,192 కోట్ల భారీ వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్ని చోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైఫన్లు నిర్మించారు.

ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్తో అక్విడెక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా ప్రాజెక్టును వేగవంతం చేశారు.
2.87 లక్షల ఎకరాలకు సాగునీరు..
ఈ గోదావరి జలాల విడుదలతో నాలుగు జిల్లాల పరిధిలోని 2,87,320 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, 5.23 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా లభించనుంది. మొత్తం 23.44 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ పరిశ్రమలకు, తాగునీటికి, సాగుకు ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. పాయకరావుపేట అక్విడెక్ట్ ద్వారా విడుదలయ్యే నీటితో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువను, అలాగే జిల్లాలోని 110 చెరువులను వరుసగా నింపనున్నారు. దీనివల్ల అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సత్వర ప్రయోజనం కలగనుంది.
రైతన్నకు కొండంత అభయం.. స్థిరీకరణ దిశగా అడుగులు!
గోదావరి వెల్లువతో ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాలు, పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ కానున్నాయి. దీంతో పాటు పంపా ఆయకట్టు కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరాహ, మామిడి గెడ్డల పరిధిలో మరో 46,620 ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. భవిష్యత్తులో ఈ ఎడమ కాలువను 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టుకు అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అనుసంధానం ద్వారా విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించి, మొత్తంగా ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.














Click it and Unblock the Notifications