అడ్డగోలుగా వ్యవహరిస్తే జైలుకు: పోలవరంపై బీజేపీ వార్నింగ్, లేఖలో ఏముందంటే
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టుపై కేంద్రం లేఖ రాయడంపై సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తే, బీజేపీ నేతలు శుక్రవారం ఎదురుదాడి ప్రారంభించారు.
Recommended Video
ఏపీలో వేడెక్కిన రాజకీయం: మోడీకి బాబు నమస్కారం! గొడవపడకుండా కేసీఆర్తో సిద్ధం
దీంతో ఏపీకి వరదాయినిగా మారుతుందని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. కాంట్రాక్టులనే మార్చవద్దని కేంద్రం చెప్పిందన్నారు.
అడ్డగోలుగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లాల్సిందే
అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే అధికారులు అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సహా ఎవరి పేరూ చెప్పకుండా ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం సంకల్పంతో ఉందని చెప్పారు.
అనవసర రాద్దాంతం
కానీ టీడీపీ నేతలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రఘునాథ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి కాంట్రాక్టుల్ని ఆపాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, టీడీపీ సర్కారు పలువురు అధికారులను పావులుగా మారుస్తోందన్నారు.
లేఖలో ఏముందంటే
అక్టోబరు 13, 16, 25 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ప్రస్తావనకొచ్చిన అంశాలను ఉటంకిస్తూ టెండర్ ప్రక్రియను ఆపేయాలని కేందం లేఖలో సూచించింది. లేఖలో ఏముందంటే.. ప్రస్తుత కాంట్రాక్టును తొలగించడం సరికాదని మేము అభిప్రాయపడింది.
లేఖలో ఇంకా
లేఖలో ఇంకా.. 'కొత్త కాంట్రాక్టర్ అవసరమైన యంత్రసామగ్రి సమీకరించుకోడానికే చాలా సమయం పడుతుందని పేర్కొన్నాం. ప్రస్తుత కాంట్రాక్టర్ నుంచి కొత్త కాంట్రాక్టర్కు యంత్రపరికరాల పరంగా సహకారం అవసరమవుతుందని ఇందుకు ప్రస్తుత కాంట్రాక్టర్ స్పందన ఏమిటో చెప్పమన్నాం. కొత్త కాంట్రాక్టర్కు అప్పగిస్తే అయ్యే వ్యయభారంతో పాటు ప్రాజెక్టు పూర్తి చేసే షెడ్యూలును కూడా పంపాలని అడిగాం. ఇంతవరకూ ఆ వివరాలు పంపలేదు. పోలవరం అథారిటీ ఈ అంశాలన్నీ పరిశీలించి పరిష్కరించే వరకు ప్రారంభించిన టెండర్ల ప్రక్రియను నిలిపివేయండి' అని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది.
డిసెంబర్ 5న పోలవరానికి బృందం
కాగా, డిసెంబరు 5న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ జల విద్యుత్తు సంస్థకు చెందిన నిపుణుల కమిటీ రానుంది. ఈ ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం అవసరమా లేక ప్రధాన డ్యాంలో అంతర్భాగంగానే దీన్ని కూడా నిర్మించవచ్చా లేదా ఇతరత్రా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాల్ని పరిశీలించేందుకు ఈ కమిటీని కేంద్ర జల వనరులశాఖ ఏర్పాటు చేసింది. పరిశీలన అనంతరం కమిటీ తొలుత ప్రాథమిక నివేదిక, తదుపరి సమగ్ర నివేదిక సమర్పించనుంది.
విష్ణు కుమార్ రాజు ఏమన్నారంటే
కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రాసిన లేక ఒక టెక్నికల్ అంశంగా బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు గురువారం చంద్రబాబును కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ లేఖకు జవాబిస్తే సరిపోతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరగాలని తాము కోరుకోమని, పోలవరం జాతీయ ప్రాజెక్టు అని గుర్తు చేశారు. విభజన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.