కరోనాపై తప్పుడు ప్రచారం: 60 మందిపై కేసులు, ఏపీలో ఫ్యాక్ట్చెక్ వ్యవస్థ అవసరం
అమరావతి: కరోనావైరస్పై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, సమాచారం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఏపీ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనాకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 60 మందిపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలతో భయాందోళనలు సృష్టించడం, ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మేలా నకిలీ పోస్టులు సృష్టించి వైరల్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టారు.
కాగా, గత పదిరోజుల వ్యవధిలోనే కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఇది ఇలావుండగా, పౌరులకు వచ్చే సందేహాలపై ఏపీ పోలీసులు ట్విట్టర్లో వివరణ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న సందేశాల వాస్తవికతను నిర్ధరించుకునేందుకు తెలంగాణలో ఫ్యాక్ట్ చెక్ పేరిట ఐటీ విభాగం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ నిర్వహిస్తోంది. వారికి అందే ఫిర్యాదులను పరిశీలించి అవి నిజమో కాదో చెబుతోంది. ఇలాంటి సమగ్ర వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం ఇదే..
గతంలో జరిగిన ఏవేవో ఘటనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను జోడించి అవి ప్రస్తుతం కరోనాకు సంబంధించినవేనని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా మంది పోస్టులు వైరల్ చేస్తున్నారు. దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలు పెట్టారు. చర్చీలు, మసీదుల్లో ఎందుకు పెట్టడం లేదు?మరో 3 నెలలపాటు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
మందులకు, డబ్బులు దొరకవు.. ఇప్పుడే నిల్వ పెట్టుకోండి అంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చెప్పారంటూ ఆడియో సర్కులేట్ చేస్తున్నారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం భారత్లో చట్టరీత్యా నేరం.