అమరావతి రైతులకు క్లారిటీ - అందుకు నో పర్మిషన్ : మరో సారి కోర్టుకు జేఏసీ...!!
అమరావతి రైతుల పాదయాత్ర తిరుపతికి చేరుతోంది. ఈ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి మేర్లపాక వరకు కొనసాగనుంది. మధ్యలో ఇసుకగుంట వద్ద భోజన విరామానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక, ఈ నెల 17వ తేదీకి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసి రెండేళ్లు పూర్తవుతుంది. సరిగ్గా అదే రోజున తిరుపతిలో పాదయాత్ర ముగించి బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. తొలుత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా..కోర్టుకు వెళ్లటంతో..కొన్ని షరతులతో కోర్టు వారి పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.

సభకు అనుమతి నిరాకరణ
ఇక, ఇప్పుడు పాదయాత్ర ముగింపులో భాగంగా 17న తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు లేఖ పంపారు. హైకోర్టు కేవలం పాదయాత్ర నిర్వహణకు మాత్రమే అనుమతించిందని, కొవిడ్ నిబంధనల మేరకు బహిరంగ సభకు అంగీకరించలేదని అందులో స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే ఆస్కారమున్నందున బహిరంగ సభకు అనుమతివ్వడం లేదని వెల్లడించారు.

కోర్టుకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం
పలు సంఘాలు పోటాపోటీగా సభకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నందున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో అనుమతించలేదని స్పష్టం చేశారు. సభ నిర్వహణకు అవకాశమివ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అమరావతి పరిరక్షణ కో కన్వీనర్ తిరుపతిరావు వెల్లడించారు. పాదయాత్ర ముగింపు వేళ.. తిరుమలకు కాలినడకన చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. సుమారు 500 మందికి దర్శనభాగ్యం కల్పించాలని కోరుతూ ఇప్పటికే ఐకాస నేతలు తితిదే ఈవో జవహర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

శ్రీవారి దర్శనం కోసం వినతి
అయితే మహాపాదయాత్ర నిర్వహిస్తున్న అంశంపై తితిదే అధికారులు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తితిదే సందేహాలను తీర్చేలా దరఖాస్తుతోపాటు పలు అంశాలను పొందుపర్చారు. ఎక్కడా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించబోమని, నినాదాలు చేయబోమని వివరించారు. తిరుమల కొండమీద సైతం నినాదాలు చేయబోమని, ఈ అంశంపై మాట్లాడేది లేదని వెల్లడించారు. మహా పాదయాత్రకు శుక్రవారం విరామం ఇవ్వడంతో కొందరు స్వామిని దర్శించుకున్నారు.
Recommended Video

17న పాదయాత్ర ముగింపు
అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, కో కన్వీనర్ తిరుపతిరావుతో పాటు పలువురికి భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్, తెదేపా నేతలు దగ్గరుండి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు. ఇక, ఇప్పుడు జేఏసీ నేతలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించటంతో.. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణ ఆధారపడి ఉంది. తమ పాదయాత్రకు ప్రకాశం..నెల్లూరు..చిత్తూరు జిల్లాల్లో కనిపించిన స్పందన పైన జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా.. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications