కిరణ్ వస్తే హెలికాప్టర్ గాల్లోపేల్చేస్తాం: పొన్నం సంచలనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కరీంనగర్ జిల్లాకు వస్తే ఆయన హెలికాప్టర్ను తాము తుపాకీతో గాల్లోనే పేల్చేస్తామని హెచ్చరించారు.
పొన్నం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబును శాసన సభ వ్యవహారాల నుండి తప్పించడం ద్వారా కిరణ్ తన వక్రబుద్ధిని నిరూపించుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర నేతలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని హితవు పలికారు.
జూలై 30వ తేదిన తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన చేసిందని, అప్పటి నుండి కిరణ్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఉన్న కిరణ్ తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి ఏమాత్రం వీల్లేదన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఆయన కరీంనగర్ జిల్లాకు వస్తే తుపాకీతో ఆయన హెలికాప్టర్ను గాల్లే పేల్చేస్తామన్నారు. కిరణ్ హెలికాప్టర్ తెలంగాణలో ల్యాండ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత పోలీసుల పైనే ఉందన్నారు.
తాము వద్దని చెబుతున్నా కిరణ్ రావడం సరికాదన్నారు. రావొద్దని చెప్పిన తర్వాత బుద్ధి ఉన్న వారెవరు కూడా రారన్నారు. శ్రీధర్ బాబు శాఖ మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు వ్యూహాత్మకంగా వెళ్లాలన్నారు. అవసరమైతే కిరణ్ క్యాంపాఫీసును ఆక్రమించుకోవాలని సూచించారు.