కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుపతి-సుప్రీంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టిన కేఏ పాల్..!
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై అన్ని వర్గాల వారూ స్పందించారు. ఇదే అంశంపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని సుప్రీంను కోరారు.
తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా లేక సీబీఐ విచారణ జరిపించాలా అన్న మీమాంస ఓవైపు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ కీలక తీర్పు వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతటితో ఆగకుండా తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. దీని వెనుక ఉన్న కారణాలను కూడా ఆయన పిటిషన్ లో వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 740 మంది క్యాథలిక్కుల (క్రైస్తవుల) కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని కేఏ పాల్ పిటిషన్ లో తెలిపారు. అలాగే కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తప్పేంటని పాల్ ప్రశ్నించారు. ఇప్పటికే లడ్డూ వివాదం తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదు. కానీ సుప్రీంకోర్టులో మాత్రం కేంద్రం తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్ధితి ఎదురు కానుంది.
మరోవైపు సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు పాల్ ఆరోపించారు. లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై జూలై నెలలో నివేదిక వస్తే సెప్టెంబర్ వరకూ ఆగి ఎందుకు ఆరోపణలు చేశారని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications