సచివాలయ ఉద్యోగుల గూబ పగులగొట్టండి- టీడీపీ నేత షాకింగ్ పిలుపు..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్ధతో పాటు వాలంటీర్ల వ్యవస్దను కూడా అమల్లోకి తెచ్చారు. అయితే వైసీపీ హయాంలో ఈ వ్యవస్ధ పూర్తిగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసాయని విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపణలు చేసేవి. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారింది. దీంతో సదరు వాలంటీర్లను ఏం చేయాలో ఇప్పటికీ ఆయా పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయం అంతకంతకూ ఆలస్యమవుతోంది.
అదే సమయంలో పలు సచివాలయాల్లో ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్న వాలంటీర్లు, వైసీపీ నేతలు అధికార టీడీపీ నేతల కంటే ఎక్కువగా ఇప్పటికీ హవా చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు సచివాలయ అడ్మిన్లుగా ఉన్న కార్యదర్శులకు తాజాగా ఓ హెచ్చరిక చేశారు. వాలంటీర్లు లేదా వైసీపీ నేతల్ని సచివాలయాల్లోకి రానిస్తే అడ్మిన్ల గూబ పగులగొట్టాలని తమ పార్టీ నేతలకు టీడీపీ ఎస్సీ సెల్ ప్రకాశం జిల్లా నేత, అధికార ప్రతినిధి కూడా అయిన ఎద్దు శశికాంత్ భూషణ్ పిలుపునిచ్చారు.

వాలంటీర్స్ గాని వైసీపీ నాయకులు గాని సచివాలయం మెట్లు ఎక్కితే అడ్మిన్ గూబ పగలకొట్టండి, ఏ పోలీసోడు వచ్చి ఏం చేస్తాడో చూస్తా అంటూ సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి శశికాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతోంది. లేకపోతే ఆందోళనలు చేపడతామని ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications