నిర్బంధంలో విజయవాడ: బీఆర్టీఎస్ రోడ్డు బంద్: వెనకడుగు వేయని వేలాదిమంది ఉద్యోగులు
అమరావతి: ఏపీలో నెలకొన్న పీఆర్సీ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. కొత్త వేతనాలను అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఉద్యమిస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఇవ్వాళ ఛలో విజయవాడ ఆందోళనను చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
Recommended Video

కొలిక్కిరాని చర్చలు..
విజయవాడకు బయలుదేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్నారు. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వం గానీ, ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు గానీ మెట్టు దిగట్లేదు. దీనితో ప్రతిష్ఠంభన యధాతథంగా కొనసాగుతోంది. ప్రభుత్వం పలుమార్లు చర్చలకు ఆహ్వానించినప్పటికీ.. ఐక్య కార్యాచరణ కమిటీ, పీఆర్సీ సాధన సమితి నాయకులు స్పందించలేదు. సంప్రదింపులు నిర్వహించడానికి మంత్రులతో కూడిన కమిటీ సమక్షానికి హాజరు కాలేదు. మంగళవారం వారు మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ- అవి కొలిక్కి రాలేదు.

అనుమతి లేనప్పటికీ..
ఇది- ప్రభుత్వ ఉద్యోగులను మరింత రెచ్చగొట్టినట్టయిందనే అభిప్రాయం ఉంది. పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు- ఆ ప్లే స్లిప్పులను తగులబెట్టడాన్ని బట్టి చూస్తే- వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఛలో విజయవాడ ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ- ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనక్కి తగ్గట్లేదు. దాన్ని విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. మారువేషాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు.

పోలీసు దిగ్బంధంలో విజయవాడ..
ఉద్యోగులెవరూ విజయవాడకు చేరుకోకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతమ్మపేట గేటు నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా మధురానగర్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బీఆర్టీఎస్ రోడ్ వద్దకు చేరుకున్న మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగుల ర్యాలీ, బహిరంగ సభ వల్ల వాహనాల రాకపోకలు స్తంభించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

వాహనాల దారిమళ్లింపు..
ఇందులో భాగంగా పలు వాహనాలను దారి మళ్లించారు. రామవరప్పాడు, గుణదల వైపు నుంచి వచ్చే వాహనాలను పడవలరేవు వద్ద దారి మళ్లించారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు ఏలూరు రోడ్ మీదుగా విజయవాడలోనికి వెళ్లాల్సి ఉంటుంది. గాంధీనగర్, పెజ్జోనిపేట, కేదారేశ్వర పేట, అయోధ్యనగర్ వైపు నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సింగ్ నగర్, నున్న వైపునకు వెళ్లే వాహనాలను ఎఫ్సీఐ, సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లించారు.

మధ్యాహ్నం వరకు బీఆర్టీఎస్ రోడ్ బంద్
మధ్యాహ్నం 3గంటల వరకు బీఆర్టీఎస్ రోడ్డులో వాహన రాకపోకలకు అనుమతి లేదు. వన్ టౌన్, టూ టౌన్, భవానిపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను కట్ట మీదుగా దారి మళ్లించారు. ఎఫ్సీఐ, ఏలూరు లాకులు మీదుగా సిటీ లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషన్ ఉత్తర్వులను జారీ చేశారు. విజయవాడ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంత నిర్బంధంలోనూ వేలాదిమంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు. ర్యాలీగా బయలుదేరి వెళ్లడానికి సమాయాత్తం అయ్యారు.
కొనసాగుతున్న అరెస్టుల పర్వం..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విజయవాడకు చేరుకోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ఎక్కడకక్కడ అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. టోల్గేట్ల వద్దా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులుగా తేలినవారిని అదుపులోకి తీసుకున్నారు. గుండుగొలను- విజయవాడ మార్గమధ్యలోని కలపర్రు టోల్గేట్ వద్ద కొంతమంది ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. రైల్వేస్టేషన్లలోనూ రాత్రంతా ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు.












Click it and Unblock the Notifications