కెసిఆర్తో చర్చలు, కొత్త సిఎం త్వరలో తెలుస్తాడు: డిగ్గీ
న్యూఢిల్లీ: తమ ఇరు పార్టీల మధ్య ఉండాల్సిన భవిష్యత్తు సంబంధాలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ప్రాథమిక చర్చలు జరిగాయని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే కాంగ్రెసులో తెరాసను విలీనం చేస్తానన్న హామీకి కెసిఆర్ కట్టుబడాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కాంగ్రెసుకు మెజారిటీ ఉందని, కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది త్వరలో తెలుస్తుందని ఆయన అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఏ ప్రాంతం నుంచైనా రావచ్చునని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తప్ప అన్ని విషయాల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి విధేయతతో ఉన్నారని, ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించారని, అందుకు అవార్డు కూడా అందించారని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం కాంగ్రెసు పార్టీకి విధేయత ప్రదర్శిస్తూ వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డిని తాము సస్పెండ్ చేయలేదు కాబట్టి పార్టీకి తిరిగి వస్తానంటే తీసుకుంటామని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులను సస్సెండ్ చేశామని, వారు రావాలనుకుంటే పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల ఆమోదంతోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం వల్లనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు.
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ను తప్ప సీమాంధ్ర నేతల మిగతా డిమాండ్లను అన్నింటినీ అంగీకరించామని ఆయన చెప్పారు. విభజన ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర కొత్త రాజధానికి కేంద్రం సహకరిస్తుందని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రధాని, హోం మంత్రి, ఆర్థిక మంత్రి కృషి చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బాధాకరమైనా తప్పలేదని అన్నారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రకు తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఇరు రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి సాధించడానికి సహకరిస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఇరు ప్రాంతాలకు పిసిసిలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విభజనపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాట మార్చాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications