అతనే అభ్యర్థి అయితే 50వేల మెజారిటీ ఖాయం?
తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నాయకులు రోడ్లపైనే వివాదాలకు దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా అన్ని పార్టీల నేతలు తీర్మానించారు. దీని పరిధిలో తాడికొండ, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో ఈ రెండు సీట్లను టీడీపీ కైవసం చేసుకోలేకపోయింది. రాజధాని పరిధిలో ఉండే నియోజకవర్గాలు కాబట్టి ఆ రెండు కచ్చితంగా గెలుచుకుంటామనుకున్న టీడీపీ వ్యూహకర్తల అంచనాలు తలకిందులయ్యాయి.

వైసీపీలో రగడ
మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోంది. ఇది ఎస్సీ రిజర్వుడు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అతి తక్కువ సమయంలోనే ఆమె నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కోవడంతో డొక్కా మాణిక్యవరప్రసాద్ ను, ఆ తర్వాత కత్తెర సురేష్ ను ఇన్ఛార్జిగా నియమించారు. సీటు తమదంటే తమదంటూ ఈ ముగ్గురి అనుచరులు తాడికొండ రోడ్లమీదే వివాదాలకు దిగుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత రైతులు మూడున్నర సంవత్సరాలుగా
నిరసన దీక్షలు చేస్తున్నారు.

టీడీపీ ఇన్ఛార్జిగా తెనాలి శ్రావణ్ కుమార్
వైసీపీమీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని కచ్చితంగా గెలుచుకుంటామని టీడీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. టీడీపీ తరఫున ఇన్ ఛార్జిగా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. అయితే తాడికొండ సీటును తన అనుచరుడు తోకల రాజ్యవర్థన్ రావుకు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు అనేదానికన్నా ఆయన నేరుగా అధిష్టానాన్ని బెదిరించే ధోరణిలోనే మాట్లాడారు. ఉండవల్లి శ్రీదేవి మీద ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని, అమరావతి రైతులంతా టీడీపీవైపే ఉండటంతో ఈ సీటును సులువుగా గెలుచుకుంటామని టీడీపీ భావిస్తున్న తరుణంలో ఇక్కడినుంచి పోటీచేయడానికి ముగ్గురుకంటే ఎక్కువ అభ్యర్థులు పోటీపడుతున్నారు.

బలమైన అభ్యర్థి అయితే మెజారిటీ..
అమరావతి పరిరక్షణ సమితి నాయకుడిగా టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజధాని గళం వినిపించే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా తాడికొండ సీటుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరఫున ఇక్కడ సరైన అభ్యర్థి, అంగబలం, అర్థబలం ఉన్న బలమైన అభ్యర్థి నిలబడితే 50వేల మెజారిటీతో సులువుగా గెలుపొందవచ్చని, అలా కాకుండా సాధారణ అభ్యర్థి, సాధారణ పోటీ జరిగితే 5వేల మెజారిటీతోనే విజయం సాధిస్తారన్నారు. బలాబలాలే ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను శాసించబోతున్నాయని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications