ఏపీలో రాష్ట్రపతి ముర్ము - ఎన్టీఆర్ స్వగ్రామంలో : ప్రభుత్వ పౌర సన్మానం..!!
రాష్ట్రపతి ముర్ము ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలి సారి ఏపీకి వస్తున్న ముర్ముకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ముర్ము ఏపీకి వచ్చారు. సీఎం జగన్ తన నివాసంలో ముర్ముకు తేనేటి విందు ఇచ్చారు. ఆ తరువాత జరిగిన వైసీపీ ఎంపీలు - ఎమ్మెల్యేల సమావేశంలో తనకు మద్దతు ఇవ్వాలని ముర్ము కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు - పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేల సమావేశంలోనూ ముర్ము పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి హోదాలో ముర్ము అమరావతికి వస్తున్నారు.

రాష్ట్రపతి రెండు రోజుల ఏపీ పర్యటన
రాష్ట్రపతి ముర్ము 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఆమె ఢిల్లీలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హజరవుతారు. ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సన్మానిస్తారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ హరిచందన్ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. సాయంత్రం విశాఖలో జరిగే నేవీడే ఉత్సవాలకు.. రక్షణ దళాల సుప్రీం కమాండర్గా ముఖ్య అతిథిగా హాజరై, విన్యాసాలను తిలకిస్తారు.

నిమ్మకూరు - కర్నూలు కేంద్రంగా అభివృద్ధి పనులకు
విశాఖ వేదికగానే రాష్ట్రంలో రక్షణ- జాతీయ రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు. అందులో భాగంగా కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏయిర్ రేంజ్ ను ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ స్వగ్రామం క్రిష్ణా జిల్లా నిమ్మకూరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ప్రారంభించే వాటిలో రాయచోటి - అంగల్లు జాతీయ రహదారి సెక్షన్ తో పాటుగా కర్నూలు నగరంలో ఆరు లేన్లుగా విస్తరించిన రోడ్లు ఉన్నాయి. మదిగుబ్బ- పుట్టపర్తి హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.

ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - సూచనలు
గవర్నర్ - సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖ లో కార్యక్రమాలు పూర్తయిన తరువాత అక్కడి నుంచి అదే రోజు రాత్రికి తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. ఇక, అదే రోజున సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. జీ20 నాయకత్వ అంశం పైన రాష్ట్రపతి భవన్ లో ప్రదాని మోదీ అధ్యక్షతన జరిగే అన్ని పార్టీల సమావేశానికి సీఎం హాజరవుతారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అదే సమావేశంలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications