ఏపీలో ఇవాళ్టి నుంచి ఎలిమెంటరీ స్కూళ్లు - తల్లితండ్రులకు సూచనలివే...
ఏపీలో కరోనా లాక్డౌన్ కారణంగా మూతపడిన విద్యాసంస్దలను ప్రభుత్వం దశల వారీగా ఫునఃప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలను కూడా తిరిగి ప్రారంభిస్తోంది. కరోనా ప్రభావం తగ్గడం, అత్యల్ప సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నందున ఇవాళ్టి నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇవాళ్టి నుంచి ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులు స్కూళ్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రైమరీ స్కూళ్లలోనూ విద్యాభ్యాసం ప్రారంభమవుతోంది. లాక్డౌన్ తర్వాత తొలిసారిగా ప్రాథమిక విద్యాసంస్ధలు తెరుచుకోనున్న నేపథ్యంలో 1 నుంచి ఐదో తరగతి విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు క్షేత్రస్ధాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Recommended Video
కరోనా తర్వాత స్కూళ్లు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.45 వరకూ రెండు పూటలా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అలాగే తమ పిల్లలను స్కూళ్లకు పంపుతామని తల్లితండ్రుల నుంచి అనుమతి తీసుకోవాలని స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఒక్కో క్లాసులో 20 మంది విద్యార్ధులను మాత్రమే ఉంచాలని ప్రభుత్వం తెలిపింది. స్కూళ్లలో సరిపడా గదులు లేకపోతే విడతల వారీగా క్లాసులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.