ఏపీ సర్కారు కీలక నిర్ణయం -ఫిబ్రవరి1 నుంచి ప్రైమరీ స్కూళ్లు రీఓపెనింగ్: విద్యా మంత్రి సురేశ్ వెల్లడి
కరోనా విలయం తగ్గుముఖం పడుతోన్న వేళ కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా బడులు తెరిచి, 9, 10వ తరగతులకు బోధన ఆరంభించిన ఏపీ.. అనతికాలంలోనే 6 నుంచి 8 తరగతులకు కూడా పాఠశాలలు తెరవడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రైమరీ స్కూళ్లను కూడా తెరవబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఏపీలో వచ్చే నెల నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలను తెలిపారు.
ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు తెరుచుకుంటాయని, అయితే, విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని మంత్రి సురేశ్ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.
ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకే అనుమతి ఉంటుందని, గదులు సరిపోని చోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామని విద్యా మంత్రి చెప్పారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపడతామని వివరించారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏపీ సర్కారు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఏపీలో 'నాడు-నేడు' పేరుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లుగా తీర్చిదిద్దడం తెలిసిందే. పిల్లల్ని బడికి పంపినందుకుగానూ తల్లులకు నగదు సాయం అందించే పథకం కూడా ఏపీలో కొనసాగుతున్నది. అదే సమయంలో పుస్తకాలు, యూనిఫారం, షూ తదితర వస్తువుల్ని కూడా ఉచితంగా అందజేస్తున్నారు.