జగన్ విధేయ ఉద్యోగ నేతకు సర్కార్ షాక్ ! సొంత అసోసియేషన్ కూడా హ్యాండ్..?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలంతా దాదాపుగా ప్రభుత్వ పెద్దలతో అంటకాగేవారు. ఇదే క్రమంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా పల్లెత్తు మాట అనేవారు కాదు, అనేందుకు ఉద్యోగులకూ అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారికి షాకులు తప్పడం లేదు. ఇదే క్రమంలో గత ప్రభుత్వంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్ర సచివాలయాన్ని గుప్పిట్లో ఉంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డికి కూటమి సర్కార్ షాకిచ్చింది. గత ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయన అధ్యక్షుడిగా ఉన్న సచివాలయ ఉద్యోగ సంఘానికి కూడా నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మీ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది.

అయితే దీనిపై స్పందించిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ వ్యవహారంలో కాకర్ల వెంకట్రామిరెడ్డితో తమకు సంబంధం లేదని తెలిపింది. ఆయన వ్యక్తిగతంగానే వైసీపీకి ప్రచారం చేసుకున్నట్లు సమాధానం ఇచ్చింది. తద్వారా వెంకట్రామిరెడ్డి చర్యలకు తమను బాధ్యుల్ని చేయొద్దని కోరింది. దీంతో అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు ఉద్యోగ సంఘం వైపు నుంచీ వెంకట్రామిరెడ్డి ఒంటరి అయినట్లయింది. అక్కడితో ఆగకుండా సచివాలయం బయట వైసీపీకి ఆయన చేసిన ప్రచారంపై కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటే తీసుకోండని కూడా తెలిపింది. అంతే తప్ప తమ గుర్తింపు రద్దు చేయొద్దని కోరింది.












Click it and Unblock the Notifications